నల్లగొండ : ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో కేటీఆర్ ప్రసంగించారు. చేనేత మీద పన్ను విధించిన మొట్టమొదటి ప్రధానమంత్రి, దుర్మార్గపు ప్రధాన మంత్రి మోదీనే. చేనేతకు మరణశాసనం రాసింది మోదీనే. ఆయన కంటే ముందున్న 14 మంది ప్రధానమంత్రులు చేయని దుర్మార్గాన్ని చేసి, చేనేతకు మరణ శాసనం రాశారు. ఈ రోజు చేనేత మీద 5 శాతం జీఎస్టీ విధించారు. చేనేత బంద్ అయిపోయే రోజును మోదీ తీసుకొస్తరు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేశాడు. నేతన్నకు ఇచ్చే బీమా పథకాన్ని ఎత్తేశాడు.
కేసీఆర్ మాత్రం చేనేత మిత్ర పేరుతో 40 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. ఎన్నికలు రాగానే ఆగమాగం మాటలు చెబుతున్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే.. ఈ నియోజకవర్గానికి రూ. 1000 కోట్లు ఇస్తానని అమిత్ షా చెప్పిండు అని రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుండు. ఉప ఎన్నిక వచ్చిన చోటల్లా ఇదే మాట చెబుతారు. ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. పచ్చి మోసగాళ్లు బీజేపీ నాయకులు. కేవలం ఎన్నికల్లో గెలిచేందుకే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. రైతన్న, గీతన్న, నేతన్న కోసం పని చేసే నాయకుడిని గెలిపించుకుందాం. సాగునీటి ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చడం లేదు. 811 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమకు రావాల్సిన 575 టీఎంసీలు ఇవ్వాలని కోరాం. కానీ స్పందన లేదు. నీళ్లలో వాటా తేల్చకుండా చావగొడుతున్నారు. కేసీఆర్కు మంచి పేరు రాకుండా మోదీ ఆగం చేస్తున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు.