హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా పరుష పదజాలంతో రెచ్చిపోతున్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. టీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ.. దున్నపోతుకు సున్నం పూస్తే ఎద్దు కాదు.. ఓ కాంట్రాక్టర్కు తెల్ల చొక్కా వేస్తే వెంటనే ప్రజాప్రతినిధి అయిపోడు. ఆయన వైఖరి మారదు. పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా రాజగోపాల్ రెడ్డి పని చేశారు. ప్రజా సమస్యలపై ఫోకస్ చేయాలి. గత నాలుగేండ్లుగా మునుగోడు నియోజకవర్గ ప్రజల సమస్యలను, గోడును వినలేదు. గ్రామాలను, మున్సిపాలిటీలను పట్టించుకోలేదు.
కాంట్రాక్టర్లు, బిల్లుల గురించే అసెంబ్లీలో మాట్లాడుతాడు. మునుగోడు ప్రజలను అనాథలుగా వదిలేశారు. ఒక్క గ్రామంలో కూడా పర్యటించలేదు. నేను కాంట్రాక్టర్ని, ఆ డబ్బుతో ప్రజలను అంగడి సరుకులా కొంటానని చెప్పి ఉప ఎన్నిక తీసుకొచ్చారు. ఏ నాయకుడైనా, ఏ పార్టీ అయినా ఈ పని చేశాను అని చెప్పాలి. కానీ కుంటిసాకులు, పరుష పదజాలంతో రెచ్చిపోతున్నారు. దున్నపోతుకు సున్నం పూస్తే ఎద్దు కాదు.. కాంట్రాక్టర్కు కలరేస్తే వెంటనే ఎమ్మెల్యే కాలేడు. ప్రజాప్రతినిధి కాలేడు. అసలు ప్రజల మనిషి కాలేడు అని కేటీఆర్ పేర్కొన్నారు.