నల్లగొండ : బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ నాలుగేండ్ల పాటు నియోజకవర్గాన్ని రాజగోపాల్ రెడ్డి పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఒక్కో ఓటును డబ్బు పెట్టి కొట్టాను అంటున్నాడు. ఇది ప్రజలపై బలవంతంగా రుద్దిన ఎన్నిక అని పేర్కొన్నారు.
రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ మాకు మోదీ ఇచ్చిండని ఆయనే చెబుతాడు. మళ్లీ మాది చిన్న కంపెనీ అని అంటడు. మరి చిన్న కంపెనీకి పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చిన వారెవరు? దాని వెనుక ఉన్నది ఎవరు? మునుగోడుకు అవసరం లేని ఎన్నిక ఇది. బలవంతంగా మీ మీద రుద్దబడుతున్న ఎన్నిక ఇది అని కేటీఆర్ పేర్కొన్నారు.
మిషన్ భగీరథకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలంటే మోదీ ఇవ్వరు. కానీ రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టులను అప్పనంగా రాజగోపాల్ రెడ్డికి కట్టబెట్టారు. ఓ కాంట్రాక్టర్ అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది. నాలుగేండ్ల పాటు మునుగోడును పట్టించుకోలేదు. హామీలను తుంగలో తొక్కారు. ఒక్కో ఓటుకు వేల రూపాయాలు ఇస్తున్నారు. ఈ నాలుగేండ్లలో ఒక్క మంచి పని చేయలేదు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించలేదు. చేసిందేమీ లేదు. అసెంబ్లీలో మైక్ దొరికితే.. కాంట్రాక్టర్లకు బిల్లుల వస్తలేవు అని అంటడు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.