హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభ.. సభ కాదని, అధికారం రానేరాదనే ఫ్రస్ట్రేషన్ సభ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సభపై ఆయన ట్విట్టర్లో స్పందించారు. ‘అది డిక్లరేషన్ సభ కాదు.. అధికారం రానేరాదనే కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సభ. కర్ణాటకలో కనీసం రేషన్ ఇవ్వలేని కాంగ్రెస్, తెలంగాణకొచ్చి డిక్లరేషన్ ఇస్తే నమ్మేదెవరు? గాడ్సేనే గెలుస్తాడన్న గ్యారెంటీ లేదు. మీ 12 గ్యారెంటీలకు విలువ ఎకడిది? చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట విజన్ లేని కాంగ్రెస్ డజన్ హామీలు గాలిలో దీపాలే. స్వాతంత్రం వచ్చిన 75 ఏండ్ల తర్వాత కూడా ఎస్సీలు, ఎస్టీలు వెనుకబడి ఉన్నారంటే దానికి కారణం, ప్రధాన దోషి కాంగ్రెస్ పార్టీ. దళిత, గిరిజన బిడ్డలకు కాంగ్రెస్ చేసిన దశాబ్దాల పాపమే ఆ పార్టీని మరో వందేండ్ల శాపంలా వెంటాడుతూ ఉంటుంది. కర్ణాటకలో నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి పాలించే ఎబిలిటీ లేదు. రాష్ట్రం అంటేనే దేశానికి ఓ పరిపాలన పాఠం. ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేర్చని పార్టీ మీది. ఇవ్వని హామీలెన్నో అమలుచేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీది. తెలంగాణలో బీజేపీకి చరిత్ర లేదు. కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు. చరిత్ర, భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే’ అని పేర్కొన్నారు.