KTR | హైదరాబాద్ : ఎన్నికలు వచ్చినప్పుడల్లా గమ్మత్తైన డైలాగులు, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన బిల్యా నాయక్, ఆయన అనుచరులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్లో మంత్రి జగదీశ్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్.. బిల్యా నాయక్, ఆయన అనుచరులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
కేసీఆర్తో మాత్రమే గిరిజనులకు న్యాయం జరుగుతదని చెప్పి బీఆర్ఎస్లో చేరుతున్నానని బిల్యా నాయక్ చెప్పారని కేటీఆర్ తెలిపారు. ఇవాళ వాస్తవం ఏందంటే.. దశాబ్దాలు కొట్లాడితే పరిష్కారం కాని సమస్యలు మేం అడగక ముందే పరిష్కారం చేశారని బిల్యా నాయక్ అన్నారని పేర్కొన్నారు. కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. 30 వేల మంది గిరిజన బిడ్డలు.. వార్డు మెంబర్ల నుంచి సర్పంచ్ల వరకు ప్రజాప్రతినిధులుగా ఎదిగారు. ఇది మాకు ఒక కానుక అని బిల్యా నాయక్ తెలిపినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఫ్లోరోసిస్ను రూపుమాపిన నాయకుడు కేసీఆర్ మాత్రమే అని చెప్పారు. అన్నింటికి మించి గిరిజన జాతికి రిజర్వేషన్లు కల్పించారు. మా తండాలకు త్రీ ఫేజ్ కరెంట్ వస్తుందని బిల్యా చెప్పారు. విద్యా, ఉద్యోగాల్లో 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన మొనగాడు కేసీఆర్ అని ఆయన చెప్పారు. ఇన్ని కారణాల వల్ల బీఆర్ఎస్లోకి వస్తున్నాను. రాజకీయంలో కూడా చూసుకోవాలని కాకపోతే ఇన్ని కారణాలు ఉన్నాయని బిల్యా నాయక్ చెప్పారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
రవీంద్ర నాయక్, బిల్యా నాయక్ మంచి మిత్రులమని చెప్పారని కేటీఆర్ తెలిపారు. ఎలక్షన్లప్పుడే తిట్టుకుంటాం తర్వాత మంచిగానే ఉంటామని చెప్పారు. భవిష్యత్లో కూడా కలిసే ఉంటాం.. ఇద్దరు నాయకులు కలిసిన తర్వాత.. దేవరకొండ నియోజకవర్గంలో 60 వేల మెజార్టీ రావాలని కేటీఆర్ సూచించారు.
గత 15 రోజుల నుంచి 32 నియోజకవర్గాలకు వరకు తిరిగానని కేటీఆర్ గుర్తు చేశారు. ఆదిలాబాద్ నుంచి వనపర్తి దాకా, సత్తుపల్లి నుంచి మెదక్ వరకు.. తెలంగాణలోని నాలుగు మూలాలను తిరిగాను. ప్రజల మూడ్ స్పష్టంగా కనబడుతోంది. ప్రజల నుంచి అసహనం వ్యక్తం కావడం లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబడకపోగా, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయితేనే పేదలు, రైతులు, బడుగు, బలహీన వర్గాలు బాగుంటారని ప్రజలు విశ్వసిస్తున్నారని కేటీఆర్ తెలిపారు.
ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీ వాళ్లు.. కొత్త అంగిలాగు కుట్టించుకుంటారు.. ఇండ్లకు సున్నాలు వేసుకుంటారని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రి తానంటే తాను అని పోటీ పడుతారు. ఇక మీడియాలో కూడా సర్వే వస్తది.. అంతా అయిపోయిందంటారు. గమ్మతైన డైలాగులు, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తారు. 2018లో అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ను ఓడించే దాకా గడ్డమే తీయను అని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఉత్తమన్న గడ్డం ఉందో పీకిందో తెలియదు గానీ, ఇలాంటి డైలాగులు మస్తుగా విన్నాం. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా డైలాగులు కొట్టిండు. కొడంగల్లో నన్ను ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ సన్నాసి మళ్లా పోటీ చేస్తుండు.. అది వేరే విషయం కానీ.. ఇలా బేకర్ డైలాగులు కొడుతారు. ఐదారేండ్ల కింద ఓటుకు నోటు.. ఇప్పుడేమో సీటుకు నోటు.. అందుకే రేవంత్ రెడ్డిని ఇప్పుడు రేటంత రేటంత అని అంటున్నారు. వాళ్లతోటి ఏం కాదని కేటీఆర్ నిప్పులు చెరిగారు.