హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా సెస్ ఎన్నికల్లో గెలువ లేకపోయిందని, మరోసారి తెలంగాణ ప్రజల తిరస్కారానికి గురైందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. సెస్ ఎన్నికల్లో అడ్డదారిన గెలిచేందుకు భారతీయ జనతా పార్టీ సాధారణ ఎన్నికల మాదిరి అన్ని ప్రయత్నాలను చేసిందన్నారు. అయితే బీజేపీ కుటిల ప్రయత్నాలను ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించి, తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ రంగాన్ని సంపూర్ణంగా ప్రవేటీకరించి, కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్రలకు ఇది ఒక గుణపాఠంగా మారుతుందని తాను భావిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
బీజేపీ విద్యుత్ సంస్కరణల పేరిట చేస్తున్న కుట్రలపై సాధారణ ప్రజలకు సైతం సంపూర్ణ అవగాహన ఉన్నదని, అందుకే సెస్ ఎన్నికల్లో ఆ పార్టీని తిరస్కరించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. సెస్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని, ఉచిత విద్యుత్ రద్దు అవుతుందన్నారు. సబ్సిడీ విద్యుత్ సౌకర్యం ఉండదని ప్రజలు భావించారని, అందుకే బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించారని కేటీఆర్ అన్నారు. సెస్ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు భారీ ఎత్తున డబ్బులు వెదజల్లిందని, సాధారణ ఎన్నికల మాదిరి విచ్చలవిడిగా అన్ని రకాల అడ్డదారులు తొక్కిందని, అనేక ప్రలోభాలకు తెరలేపిందన్నారు. అయినప్పటికీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వెంటే నిలిచి సంపూర్ణ మద్దతు ప్రకటించారన్నారు. సెస్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి, తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం బీజేపీ పట్ల నెలకొని ఉన్న తీవ్రమైన వ్యతిరేకతకు, తిరస్కార భావానికి నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని, ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనేక ఎన్నికల్లో బీజేపీని తిరస్కరిస్తూ వస్తున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.
సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టిన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వం పైన తెలంగాణ ప్రజలకు ఉన్న అపూర్వమైన నమ్మకానికి ఈ విజయం నిదర్శనం అన్నారు. తమ ప్రభుత్వం రైతన్నలు, నేతన్నలు, దళిత, గిరిజనులకు, కుల వృత్తులకు అందిస్తున్న విద్యుత్ సంక్షేమ కార్యక్రమాలకు వారిచ్చిన జనామోదం అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల విజయంతో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన, ప్రభుత్వం పైన మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఈ గెలుపుతో ఉప్పొంగిపోకుండా సెస్ పరిధిలో మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా, మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలపైన దృష్టి పెడతామని కేటీఆర్ తెలిపారు.
విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమం, అభివృద్ధి అనే అంశాలతో కూడిన సంతులిత విధానానికి ప్రజల నుంచి దక్కిన ఆమోదంగా భావిస్తున్నామన్నారు. ఒక వైపు రైతులు, కుల వృత్తులకు, దళిత, గిరిజనులకు రాయితీలు ఇస్తూ, మరోవైపు అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. దీంతో పాటు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని భారీగా మౌలిక వసతుల కల్పన, విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్న తమ విధానాలను ప్రజలు బలపరిచారని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మరోసారి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి కృషి చేసిన పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు నాయకులకు పార్టీ తరఫున కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.