హైదరాబాద్ : మునుగోడు నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో బీజేపీకి బలం లేదు కాబట్టే బలగాలను మోహరిస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడులో 16 వేల మంది కేంద్ర బలగాలను మోహరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయని టీ న్యూస్ యాంకర్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఈ విధంగా వివరణ ఇచ్చారు.
బలం లేకపోతే బలగాలు మోహరించాల్సి వస్తది. కేంద్రంలో ఉన్న పార్టీకి బలం లేదు. క్షేత్రంలో కూడా బలం లేదు. కాబట్టి బలగాలు మోహరించి, సర్వశక్తులు ఒడ్డి, కింద మీద పడి తిమ్మిని బమ్మిని చేసి అవసరమైతే ఎలక్షన్ రద్దు చేసి, ఏదో ఒకటి చేసి.. గెలిచామని అనిపించుకోవాలని చిల్లర ప్రయత్నం తప్పా.. మునుగోడు ప్రజల చైతన్యాన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. డబ్బులు ఇవ్వండి, బలగాలు మోహరించండి.. ఏమైనా చేయండి.. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నూటికి నూరు శాతం చేనేత మీద జీఎస్టీ వేసినందుకు నేతన్న శిక్ష వేయబోతున్నాడు. మోటార్లకు మీటర్లు పెడుతాను అన్నందుకు రైతన్న శిక్ష వేయబోతున్నాడు. గ్యాస్ సిలిండర్ ధర పెంచినందుకు మా మహిళ సోదరీమణులు శిక్ష వేయబోతున్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు అని గుండు సున్నా ఇచ్చినందుకు మా తమ్ముళ్లు శిక్ష వేయబోతున్నారు. మొత్తంగా బీజేపీ డిపాజిట్ కూడా గల్లంతు చేయబోతున్నారనేది నా విశ్వాసం అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.