కథలాపూర్, జూలై 25: పేద, అనాథ పిల్లలకు విద్యలో చేయూత అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారనేది మరోసారి రుజువైంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలా మారిన ఆ చిన్నారికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ఆయన ఆర్థికసాయంతో కష్టపడి చదివి ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆ విద్యార్థిని ఇప్పుడు ఐదు బహుళజాతి కంపెనీల్లో జాబ్ ఆఫర్ కొట్టేసి శెభాష్ అనిపించుకున్నది. జగిత్యాల జిల్లా రాయికల్కు చెందిన రుద్ర భూమేశ్వర్-మమతల కూతురు రచన.
చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో జగిత్యాలలో బాలల సదనంలో పదో తరగతి వరకు చదివింది. అప్పటి కలెక్టర్ శరత్ సహకారంతో హైదరాబాద్లోని యూసుఫ్గూడలో డిప్లొమా చదివి ఈ-సెట్లో మంచి ర్యాంక్ సాధించింది. అక్కడి నుంచి వచ్చి కథలాపూర్ మండలం తాండ్య్రాలలోని తన అక్క రమ్య ఇంట్లో రచన ఉంటున్నది. రచన ఈసెట్లో మంచి ర్యాంక్ సాధించిన విషయాన్ని ఆమె బావ శేఖర్ ట్విట్టర్లో పోస్టు చేయగా మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. రచనను దత్తత తీసుకొని తన సొంత డబ్బుతో బీటెక్ చదివించారు. పట్టుదలతో కష్టపడి చదివిన రచన.. ఐదు బహుళజాతి కంపెనీల నుంచి జాబ్ ఆఫర్ లెటర్లు అందుకున్నది. కానీ, తాను ఉద్యోగంలో చేరబోనని, తన తల్లి కోరిక మేరకు కలెక్టర్ అవుతానని రచన ధీమా వ్యక్తంచేసింది. ఈ సందర్భంగా రుద్ర రచనను సోమవారం జగిత్యాల జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్కుమార్, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి శాలువాతో సన్మానించి అభినందించారు.
కేటీఆర్ సారు పునర్జన్మ ఇచ్చారు
నాకు చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు. ఎలా చదువుకోవాలని దిగులు పడ్డాను. అంతలోనే కేటీఆర్ సారు స్పందించి నాకు ఉన్నత చదువులు చదివించారు. మా అమ్మ బతికి ఉన్నప్పుడు కలెక్టర్ చేయాలని కోరిక ఉండేది. మంత్రి కేటీఆర్ సహకారంతో ఐఏఎస్ శిక్షణ పొంది కలెక్టర్ అయి అమ్మ కల నెరవేర్చాలని ఉన్నది. నాకు తల్లిదండ్రులు జన్మనిస్తే.. కేటీఆర్ సారు పునర్జన్మ ఇచ్చారు. మా అమ్మ కోరిక తీర్చాలని ఉన్నది.
–రుద్ర రచన