ఎల్లారెడ్డిపేట, మార్చి 1: ‘సార్ నాకు సాయం జెయ్యుర్రి. భార్య చనిపోయింది. ఇద్దరు బిడ్డలను సాదుకునుడు కష్టమైతుంది. ఒక ఆటో ఇప్పించండి’ అని మంత్రి కేటీఆర్కు విన్నవించిన 24 గంటల్లోనే ఓ దివ్యాంగుడి కల నెరవేరింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్కు చెందిన ఆకారం నర్సయ్య దివ్యాంగుడు. భార్య కొద్దిరోజుల క్రితమే మృతిచెందగా, ఇద్దరు కూతుళ్ల్లు మాధురి, గౌతమి ఉన్నారు. పిల్లలను పోషించడం ఆయనకు కష్టంగా మారింది.
మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో డే కేర్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ను నర్సయ్య కలిశాడు. తన దీన స్థితిని వివరించి, బతుకుదెరువు కోసం ఓ ఆటోను ఇప్పించాల్సిందిగా కోరగా, మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. నర్సయ్యకు సాయం చేసేందుకు అవకాశం చూడాలని కలెక్టర్ అనురాగ్ జయంతిని ఆదేశించారు. తహసీల్దారు జయంత్కుమార్ నర్సయ్యను కలెక్టర్ వద్దకు బుధవారం తీసుకెళ్లారు. వివరాలు తెలుసుకున్నారు. కొత్త ఆటో మంజూరైనట్టు చెప్పడంతో నర్సయ్య సంబురపడ్డాడు. మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపి రుణపడి ఉంటానని చెప్పాడు.