హైదరాబాద్ : రాజకీయ దురుద్దేశంతో, అసత్యాలను అబద్దాలను ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావాను దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి గత కొంత కాలంగా తనపైన అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్వహిస్తున్న విచారణకు హాజరవుతున్న వ్యక్తులతో తనకు ఎలాంటి సంబంధం లేదు. ఆయా కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేకున్నా, రేవంత్ రెడ్డి దురుద్దేశ పూర్వకంగా తన పేరును వాడుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇలాంటి దుష్ప్రచారం వల్ల కలిగిన పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ని సైతం ప్రారంభించాలని కేటీఆర్ కోరారు. గౌరవ న్యాయస్థానం తనపై రేవంత్ చేస్తున్న అసత్య ప్రచారాలను గుర్తించి, ఇలాంటి దురుద్దేశ కార్యక్రమాలకు పాల్పడుతున్న నిందితులను తగిన విధంగా శిక్షిస్తుందన్న విశ్వాసం తనకు ఉందని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్పై కేటీఆర్ ఘాటుగా స్పందించిన విషయం విదితమే. తాను ఎలాంటి టెస్టులకైనా సిద్ధంగా ఉన్నాను. రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ టెస్టుకు సిద్ధమైతే.. తానే ఢిల్లీ ఎయిమ్స్కు వెళ్తానని కేటీఆర్ ట్వీట్ చేశారు. చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో టెస్టులు చేయించుకునే స్థాయి తనది కాదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఒక వేళ తాను టెస్టులు చేయించుకుని, క్లీన్చీట్తో వస్తే రేవంత్ రెడ్డి తనకు క్షమాపణలు చెప్పి, పదవులు వదులుకుంటారా? అని కేటీఆర్ సూటిగా అడిగారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్టులకు రేవంత్ సిద్ధమా? అని కేటీఆర్ అడిగారు.