రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల బిడ్డలు రాష్ట్రంలో, దేశంలో అగ్రభాగాన ఉన్నారంటే మీ తల్లిదండ్రులు, అధ్యాపకులు, ప్రజాప్రతినిధులైనా తామంతా గర్వపడుతాం అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాబోయే మూడు నెలలు బాగా కష్టపడి చదివి మంచి ర్యాంకులు సాధించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. గిఫ్ట్ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట పరిధిలో 2 వేల మంది ఇంటర్ విద్యార్థులకు కేటీఆర్ ట్యాబ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు.
ఈ ట్యాబ్లను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని కేటీఆర్ సూచించారు. చదువుల కోసం వాడండి. ఇందులో ఇంటర్నెట్ పెట్టి ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్ పెట్టి అడ్డమైన కార్యక్రమాలు చేయకండి. అంటే వాటితో టైం వేస్ట్ చేయకండి. వేరే విషయం కాదు. మంచిగా చదువుకొని ఐఐటీ, నీట్ ఎంట్రెన్స్లతో పాటు ఇతర రంగాల్లో మంచి ర్యాంకులు సాధించండి. ప్రపచంతో పోటీ పడే పౌరులుగా తయారు కావాలనే ఉద్దేశంతోనే మీకు ఈ ట్యాబ్లు అందజేస్తున్నాం. వేములవాడ నియోజకవర్గానికి కూడా తప్పకుండా 3 వేల ట్యాబ్లు అందిస్తాం. రాష్ట్ర, దేశ స్థాయిలో మంచి ర్యాంకులు సాధిస్తే తమకు తృప్తి కలుగుతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
గిఫ్ట్ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా చిన్నారి తమ్ముళ్లు, చెల్లెళ్ల ముఖాల్లో చిరునవ్వులు చూడాలని ఆకాష్ బై జూస్ సాఫ్ట్వేర్ ట్యాబ్లను విద్యార్థులకు అందజేస్తున్నాo ట్యాబ్లను పంపిణీ చేస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు. ఈ ట్యాబ్ల ద్వారా పోటీ పరీక్షలకు ఉపయోగపడే మెటిరీయల్ను అందజేస్తున్నాం. బయట కంటే ఈ ట్యాబ్ విలువ రూ. 10 వేలు అవుతుంది. మెటిరీయల్ విలువ రూ. 75 వేలు అవుతుంది. అంటే ఒక్కో ట్యాబ్ విలువ రూ. 86 వేలు.. దీన్ని ఉచితంగా మీ చేతుల్లో పెడుతున్నాం. మీరు బాగా చదువుకుంటే.. మేమంతా సంతోషపడుతాం. గర్వపడుతాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఎల్లారెడ్డిపేట పాఠశాల రూ. 7 కోట్లతో అద్భుతంగా తయారవుతోంది అని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాబోయే 2, 3 నెలల్లోనే ఆ పాఠశాలను ప్రారంభిచుకుందాం అని చెప్పారు. పాఠశాల గొప్పగా తయరవుతోంది. కానీ జూనియర్ కాలేజీ గ్రౌండ్ అనుకున్నట్టు లేదు. ఈ గ్రౌండ్ను మినీ స్టేడియంగా తీర్చిదిద్దుతాం అని స్పష్టం చేశారు. వేణుగోపాల స్వామి ఆలయాన్ని రూ. 2 కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం అని చెప్పారు. మొత్తం మన జిల్లాలోని పాఠశాలలను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం. కార్పొరేట్ పాఠశాలల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దబోతున్నాం అని పేర్కొన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం కింద గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్ను ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో 26 వేల ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దడంతో పాటు ఇంగ్లీష్ మీడియంలో బోధన అందిస్తామన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తున్నాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.