హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): సివిల్స్-2021లో ర్యాంకులు సాధించినవారిని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. ‘సివిల్స్ ఫలితాలతో సంకల్పం, పట్టుదలకు నిదర్శనంగా నిలిచే కొన్ని అద్భుత ఉదంతాలు వెలుగులోకి వచ్చా యి. ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచిన ముగ్గురు అమ్మాయిలకు, తెలంగాణ నుంచి ఎంపికైన ర్యాంకర్లందరికీ నా అభినందనలు. మీ ప్రతిభ, ప్రయత్నాలతో దేశాన్ని ముందుండి నడుపుతారని ఆశిస్తున్నా’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
అవ్రామ్ గ్లేజర్తో భేటీ
వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సమావేశంలో పాల్గొనేందుకు ఇటీవల స్విట్జర్లాండ్ వెళ్లిన మంత్రి కేటీఆర్.. అక్కడ పలువురు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలను కలుసుకొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, ఇంగ్లండ్, అమెరికాలో ప్రొఫెషనల్ ఫుట్బాల్ జట్లకు యాజమానిగా వ్యవహరిస్తున్న అవ్రామ్ గ్లేజర్ను కలిశారు. ‘కొన్నిసార్లు అకస్మాత్తుగా ఆసక్తికరమైన వ్యక్తులను కలుసుకొంటాం. మాంచెస్టర్ యునైటెడ్, టంపా బే బక్కనీర్స్ ఫుట్బాల్ జట్ల యాజమని ఆవ్రామ్ గ్లేజర్ను ఇటీవల జూరిచ్లో కలిశాను. ఆయన ఎవరో ఫుట్బాల్ అభిమానులందరికీ కచ్చితంగా తెలుసు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.