రాజన్న సిరిసిల్ల : దేశంలో ప్రతిఘాతక శక్తులు రెచ్చిపోతున్నాయని.. మతతత్వ శక్తులు తెలంగాణలో అశాంతిని సృష్టించేందుకు కుట్ర చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. చిల్లర రాజకీయాలతో తెలంగాణ చరిత్రను వక్రీకరించి, మలినం చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే.. సెప్టెంబర్ 17 సందర్భాన్ని కూడా వక్రీకరిస్తున్నారని వాఖ్యానించారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని శక్తులు మంటలు రగిలిస్తున్నాయని.. ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో ఉండాలే తప్ప.. అశాంతి, అలజడులతో కాదన్నారు. మతోన్మాద శక్తుల నుంచి మరోసారి జాగ్రత్త పడాల్సిన అవసరముందని మంత్రి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో కేటీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
స్వరాష్ట్రo ఏర్పడ్డ ఎనిమిదేండ్లలోనే తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా, సఫల రాష్ట్రంగా తీరిదిద్దామని కేటీఆర్ తెలిపారు. నాటికి నేటికీ తెలంగాణలో వచ్చిన మార్పులకు దేశం మొత్తం మనవైపే చూస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా ఎన్నో అనితరమైన పనులను సుసాధ్యం చేశామని, రాజన్న సిరిసిల్ల జిల్లాను అభివృద్ధి , సంక్షేమంలో ముందంజలో నిలిపామని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనదక్షత, సమర్థ నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని కేటీఆర్ స్పష్టం చేశారు.
1947 సెప్టెంబర్ 17న భారత్లో హైదరాబాద్ విలీనమైందన్నారు. కొమురం భీం, దొడ్డి కొమురయ్య సాహసాలు మరువలేనివన్నారు. ఎందరో మహానుభావులు సామాజిక చైతన్యాన్ని రగిలించినట్టు చెప్పారు. తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి.. ప్రజాస్వామిక స్వేచ్ఛవైపు పయనించిందని కేటీఆర్ తెలిపారు. ఆనాటి ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములయ్యారని గుర్తు చేశారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పేరిట.. హైదరాబాద్ రాష్ట్రాన్ని బలవంతంగా ఏపీలో కలిపారని వ్యాఖ్యానించారు. ఏపీలో విలీనంపై హైదరాబాద్ ప్రజలు అప్పుడే ఆందోళన చెందారన్నారు. తెలంగాణ ప్రజలను ఏకం చేసి 14 ఏండ్లు సీఎం కేసీఆర్ పోరాటం చేశారనీ గుర్తు చేశారు. సుదీర్ఘ పోరాటం తర్వాత మళ్లీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందన్నారు. ఇప్పుడు దేశానికే టార్చ్ బేరర్గా తెలంగాణ నిలిచిందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ జాతీయ స్థాయికంటే ముందుందన్నారు. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా నేడు తెలంగాణ ఎదిగిందన్నారు. వైద్య, ఆరోగ్య రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రసంగం పూర్తయిన అనంతరం మంత్రి కేటీఆర్ స్వాతంత్ర్య సమరయోధులను ఘనంగా సన్మానించారు. వేదిక వద్దకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్న సమరయోధుల చెంతకు మంత్రి వెళ్లి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
స్వాతంత్ర్య సంగ్రామంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న తీరు, ఎదుర్కొన్న ప్రతిబంధకాలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కేంద్రంలో న్యాక్ ద్వారా 30 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న 25 మంది మహిళలకు మంత్రి కేటీఆర్ కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ. 6,500.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో మంత్రి @KTRTRS జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.#HyderabadIntegrationDay pic.twitter.com/wRMpbLXHM6
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 17, 2022