Minister KTR | తెలంగాణ చేనేతలు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీపుల్స్ ప్లాజాలో ఆదివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఎమ్మెల్సీ రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చేనేత బీమా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా చేనేత, మరమ్మగాల కార్మికుల కోసం బీమాను తీసుకువచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు జాతిపిత మహాత్మాగాంధీ చరకాను ఒక సింబల్గా తీసుకొని.. నూలును వడుకుతూ ఆ రోజుల్లో జాతి మొత్తాన్ని స్వదేశీ ఉద్యమం వైపు మళ్లించారన్నారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు మహాత్మా గాంధీ చరకా పట్టి, నూలు వడికితే ఆ నాడు జాతి మొత్తం కదిలిందని గుర్తు చేశారు. కానీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన తరుణంలో భారత ప్రభుత్వం చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం దురదృష్టకరమన్నారు.
కేంద్రం నిర్ణయం పరిశ్రమకు ఒక రకంగా అశనీపాతం వంటిదని, మరో రకంగా కొన ఊపిరితో ఉన్న పరిశ్రమపై జీఎస్టీ విధించడం మరణశాసనం రాసినట్లేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున, భారతదేశంలోని చేనేత కార్మికులందరి తరఫున జీఎస్టీని ఎత్తి వేయాలని కేంద్రానికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ భారతీయ కళలకు చేనేత ఉత్పత్తులు దోహదపడుతున్నాయని, భారతీయ కళలకు చేనేత ఉత్పత్తులు దోహదపడుతున్నాయన్నారు. జాతీయ చేనేత దినోత్సవమైన ఆగస్టు 7వ తేదీ నుంచి రైతుబీమా తరహాలో రైతులకు నేతన్న బీమా సౌకర్యం అమలులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఆషామాషీగా కాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా ద్వారా బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎల్ఐసీ అధికారులకు బీమాకు సంబంధించి చెక్కు అందజేసినట్లు చెప్పిన కేటీఆర్.. ఈ సందర్భంగా ఎల్ఐసీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. నేతన్న బీమా ద్వారా 80వేల కార్మికులకు లబ్ధి చేకూరుతుదన్నారు. ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే రూ.5లక్షల బీమా అందుతుందన్నారు.
ఈ సందర్భంగా చేనేత, మరమగ్గాల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కేటీఆర్ వివరించారు. చేనేత మిత్రద్వారా 50శాతం రాయితీ అందిస్తున్నామన్నారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేలా ప్రభుత్వ ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించేలా చూస్తున్నామన్న కేటీఆర్.. ప్రతి సోమవారం ఉద్యోగులు నేత వస్త్రాలను ధరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ చేనేత కళా నైపుణ్యాలు ప్రతీకలన్నారు, రామప్ప చేనేత చీరలను ఆవిష్కరించడం శుభపరిణామన్నారు. రాష్ట్రంలో చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.