వేములవాడ: దివంగత చెన్నమనేని రాజేశ్వర్ రావు జీవితాంతం ప్రజల కోసం పోరాడారని, ఆయన గొప్ప నాయకుడని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా, మేధావిగా జాతీయ స్థాయిలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. వేములవాడ పట్టణంలోని సంగీతా నిలయంలో దివంగత రాజేశ్వరరావు శతజయంతి వేడుకలకు హాజరై మంత్రి ఘన నివాళులర్పించారు. ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. రాజేశ్వర్రావు పోరాటాలు ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని నింపాయని చెప్పారు.
వారి జ్ఞాపకాలు రాష్ట్ర చరిత్ర ఉన్నంత వరకు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ఉన్నత సామాజిక వర్గంలో జన్మించినా బడుగు బలహీన వర్గాల కోసం రాజేశ్వర్రావు పోరాడారని చెప్పారు. ప్రజల కోసం ఆయన జైలు జీవితం గడిపారని తెలిపారు. చెన్నమనేని కుటుంబం చాలా గొప్పదని, చెన్నమనేని రాజేశ్వరరావు, విద్యాసాగర్ రావు, హనుమంతరావు లాంటి నాయకులు గొప్ప సేవలు అందించారని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ రంగాల ప్రభుత్వ ప్రధాన సలహాదారు, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి తదితరులు పాల్గొన్నారు.