పెద్దపల్లి సెప్టెంబర్ 9 : కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటి అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశంసించారు. శుక్రవారం ధర్మారం మండలంలోని మల్లాపూర్ గ్రామంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల జూనియర్ కళాశాలను మంత్రి సందర్శించారు.
స్వచ్ఛ గురుకుల కార్యక్రమం కింద చేపట్టిన కార్యక్రమాలను మంత్రి పర్యవేక్షించి , విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. గురుకుల కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నాణ్యమైన వస్తువులు, పదార్థాలు మాత్రమే వినియోగించాలన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యధిక సంఖ్యలో పేదల కోసం గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించి, ప్రతి విద్యార్థి పై రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనని మంత్రి పేర్కొన్నారు