పెద్దపల్లి : గ్రామాల్లోని నిరుపేద పిల్లలకు విద్యను అందించడం కోసమే మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని ధర్మారం మండల నందిమేడారం నల్లలింగయ్య పల్లెలో ప్రాథమిక పాఠశాలలో మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా 13 లక్షల 6 వేల నిధులతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..జిల్లాలో మొదటి విడతలో 274 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో మన ఊరు- మన బడి కింద 91 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
సీఎం కేసీఆర్ విద్యావ్యవస్థలో రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా మంచి ఫలితాలు సాధించారని, పూర్తిస్థాయిలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకు వచ్చే దిశగా మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని సీఎం రూపొందించారు. మన ఊరు మనడి కార్యక్రమంతో రాష్ట్రంలో సర్కారు బడుల రూపురేఖలు మారిపోనున్నాయని పేర్కొన్నారు.