హైదరాబాద్ : ఈనెల 21న ఎల్బీ స్టేడియంలో సాయంత్రం ప్రారంభమయ్యే క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ ఉత్సావాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఈ వేడుకల నిర్వహణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందన్నారు. కరోనా కారణంగా గత ఏడాది నిర్వహించలేకపోయాం, అయితే దుస్తుల పంపిణీ మాత్రం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలువురు ప్రముఖులకు పురస్కారాలు అందజేసి, సత్కరిస్తారన్నారు.
ఈ వేడుకలలో సుమారు 12వేల మంది పాల్గొంటారని, నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందరికి సరిపడే విధంగా భోజన ఏర్పాట్లు చేయాలని, సర్వీసింగ్ కోసం వలంటీర్లు ఉండాలన్నారు. పారిశుధ్యం పట్ల శ్రద్ధ తీసుకొని మోబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని భద్రతా, బందోబస్తు ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, ఎమ్మెల్యే స్టీవెన్ సన్, ఐఎఎస్ అధికారులు నదీం అహ్మద్, విజయ్ కుమార్, హరివిందర్ సింగ్, వక్ఫ్బోర్డు చైర్మన్ సలీం, నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, ఐపిఎస్ అధికారులు విజయ్ కుమార్, చౌహాన్, ఉత్సవాల కమిటీ సభ్యులు రాయడిన్ రోచ్, రాజీవ్ సాగర్, శంకర్ లూక్ తదితరులు పాల్గొన్నారు.