ధర్మపురి : అనారోగ్యంతో తల్లిని కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ అండగా నిలిచారు. వారి దీనస్థితిని చూసి చలించిన ఆయన తన ట్రస్టు తరఫున వారికి అవసరమైన ఖర్చులను చెల్లించేందుకు ముందుకు వచ్చి ఉదారతను చాటుకున్నారు. గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ గ్రామానికి చెందిన సుంకె లతకు నాలుగేళ్ల కూతురు అనన్య, రెండేళ్ల కొడుకు విశాల్ ఉన్నారు. లత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది.
తండ్రి తాగుడుకు బానిసై పిల్లలను పట్టించుకోవడం లేదు. వృద్ధురాలైన నానమ్మ చేరిదీసి కష్టమీద కూలీనాలి చేస్తూ పిల్లలను పోషిస్తున్నది. ఆదివారం చిల్వకోడూరులో మంత్రి పర్యటించగా.. పలువురు పిల్లల దీన స్థితిని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు మంత్రి వృద్ధురాలి కలిసి, ఆదుకుంటానని హామీ ఇచ్చారు. పిల్లల ఖర్చుల కోసం ఎల్ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ నుంచి పిల్లలకు ప్రతీ నెలా రూ.5వేలు అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.