వేములవాడ: తెలంగాణను సీఎం కేసీఆర్ దేశానికి దిక్సూచిగా, మోడల్ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించే మాటను నిలబెట్టుకొని, వ్యవసాయరంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించామన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్తో కలిసి ఆయన వేములవాడ రాజన్నను దర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో అత్యధికంగా ధాన్యం పండించే పంజాబ్ను కూడా మనం అధిగమించామని చెప్పారు. మూడు కోట్లకుపైగా మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నామని వెల్లడించారు.
పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని, వేములవాడలో ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. సమైక్యాంధ్రలో నిర్లక్ష్యానికి గురైన ఆలయాలు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. యాదాద్రి ఆలయాన్ని ఇప్పటికే అభివృద్ధి చేయగా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారని వెల్లడించారు. వేములవాడ, బాసర, ధర్మపురి, కాళేశ్వరం లాంటి ఆలయాలకు ప్రభుత్వం ప్రత్యక్ష నిధులను మంజూరు చేస్తూ అభివృద్ధి కృషి చేస్తుందన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇలా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరగడం లేదని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్ష పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, మండలాలు, మున్సిపల్, గ్రామపంచాయతీలను కూడా ఏర్పాటు చేసి పరిపాలనను మరింత చేరువ చేశారన్నారు.