Ambedkar | హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ దళితవర్గాల్లో నవ వసంతాన్ని తెచ్చిం ది. అంబేద్కర్ ఆశయాలు సిద్ధిస్తున్నాయనే విశ్వాసాన్ని దళితవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో ప్రత్యామ్నాయ వికాస నమూనాను తెలంగాణ ఆవిష్కరిస్తున్నదని సంబురపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదలు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన దళిత జనోద్ధరణ కార్యాచరణ మరింత ముందుకు తీసుకెళ్తున్నదని, ఇందుకు అంబేద్కర్ విగ్రహావిష్కరణే నిదర్శనమని సంబురంతో చెప్తున్నాయి. అసాధ్యాలను ఎన్నింటినో సుసాధ్యం చేసిన కేసీఆర్.. అంబేద్కర్ ఆశయాలను తప్పక నెరవేరుస్తారనే విశ్వాసాన్ని దళిత మేధావులు, బుద్ధిజీవులు ప్రకటిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో ఇప్పటివరకు అమలైన సంక్షేమ పథకాలకు దళితబంధు తలమానికం వంటిదని పేర్కొంటున్నారు. అంబేదర్ కలలకు దళితబంధు ఊపిరిపోసిందని చెప్తున్నారు.
ఎల్లెడలా విస్తరిస్తున్న అంబేద్కర్ స్ఫూర్తి
తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తిని ఎల్లెడలా విస్తరింపజేస్తున్నదనే అభిప్రాయం దళితమేధావి వర్గమే కాదు సామాన్యుల్లోనూ వ్యక్తం అవుతున్నది. ఇంతకాలం తమను ఈసడించుకున్నవారికి తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి సంఘంలో సముచిత గౌరవాన్ని తెచ్చిపెట్టిందని నల్లగొండ జిల్లా కేవీపీఎస్ అధ్యక్షుడు పాలడుగు నాగార్జున పేర్కొన్నారు. అంబేద్కర్ పేరుతో రాజకీయాలు చేసినవారిని చూశాం.. కానీ, కేసీఆర్ ఒక్కరే ఆ మహనీయుడి మహోన్నత ఆశయాలను నెరవేరుస్తామని ముందుకు వచ్చారు.. అంతకన్నా కావాల్సిందేమున్నదని వరంగల్ జిల్లావాసి బొమ్మల అంబేద్కర్ పేర్కొన్నారు.
దేశంలో దాడులు.. రాష్ట్రంలో దండలు
ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ర్టాల్లో దళితులపై విచక్షణారహితంగా భౌతికదాడులు, అత్యాచారాలు జరుగుతుంటే తెలంగాణలో మాత్రం అందుకు విరుద్ధంగా దళితుల అభ్యున్నతి, రక్షణ పట్ల చిత్తశుద్ధితో కార్యాచరణ అమలు అవుతున్నదని దళిత మేధావులు విశ్లేషిస్తున్నారు. దశాబ్దాలుగా వివక్షకు గురైన దళిత వర్గాలను తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ వికాసం వైపు నడిపిస్తున్నారని, అంబేద్కర్ విగ్రహావిష్కరణే ఇందుకు సంకేతమని నిజామాబాద్ జిల్లావాసి జీ మనోహర్ పేర్కొన్నారు. అంబేద్కర్ కలలుగన్న సామాజిక మార్పునకు కేసీఆర్ దారులు వేశారని కొత్తగూడెం జిల్లా మణుగూరువాసి అరికెళ్ల నరేశ్ చెప్పారు. గుజరాత్లో బిల్కిస్బానోపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గులను ఆ రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్షపేరుతో విడుదల చేస్తే వారేదో దేశభక్తులు అయినట్టు పూలదండలేసి సంబురాలు చేసుకున్న ఉదంతాలను నరేశ్ గుర్తుచేశారు. దళితులపై దేశవ్యాప్తంగా వివక్ష, దాడులు జరుగుతుంటే, తెలంగాణ యావత్ దళితవర్గాలకు భరోసాను ఇస్తున్నదని కరీంనగర్కు చెందిన మనుబోతు వెంకన్న పేర్కొన్నారు.
అంబేద్కర్ పేరిట అవార్డు చరిత్రాత్మకం
అంబేద్కర్ పేరిట ఏటా అవార్డు ఇస్తామని చెప్పడమే కాకుండా రూ.51 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించటం సాహసోపేత నిర్ణయమని హనుమకొండకు చెందిన డాక్టర్ రాజ్సిద్ధార్థ పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలను భవిష్యత్తు తరాలకు తీసుకెళ్తామని కేసీఆర్ వెల్లడించి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని, సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల మహనీయుల ఆశయసాధన సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు తీగల జాన్ శాస్త్రి హర్షం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం దేశ రాజకీయ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని ఎస్సీ ఉపకులాల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకట్ తెలిపారు.
దళిత జనోద్ధరణకు దిక్సూచి తెలంగాణ
సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది. గురుకులాల ద్వారా విద్యావృద్ధి, ఉపాధి, వృత్తి నైపుణ్యశిక్షణ, ఆర్థిక స్వావలంబనకు ప్రత్యేక రిజర్వేషన్లు, దేశంలో ఎక్కడాలేని విధంగా ఎస్సీ సబ్ప్లాన్ కోసం ప్రత్యేక చట్టం ద్వారా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడమే కాకుండా ఈ నిధులను వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేయడం వంటి వినూత్న విధానాలకు తెలంగాణ శ్రీకారం చుట్టిందని కాకతీయ విశ్వవిద్యాలయం రిసెర్చ్స్కాలర్స్ బొల్లికొండ వీరేందర్, వీరస్వామి ఉదహరించారు. ఇటువంటి పనులతో తప్పనిసరిగా అనుసరించాల్సిన అనివార్యతలను తెలంగాణ సృష్టించిందని, ఆ ఘనత కేసీఆర్కే దక్కుతుందని కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ బైరి నిరంజన్ పేర్కొన్నారు.
అంబేద్కర్ విగ్రహం.. సమానత్వానికి చిహ్నం: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్
దేశంలోనే అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అద్భుతమని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రశంసించారు. ఇది గర్వించతగిన విషయమని శనివారం ట్వీట్ చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున బుద్ధుని విగ్రహం, తెలంగాణ సచివాలయం మధ్యలో సమానత్వానికి చిహ్నంగా అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించాలనే సీఎం కేసీఆర్ ఆలోచన అద్భుతమని కొనియాడారు. రాష్ట్ర పరిపాలనా భవనానికి ‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం’గా నామకరణం చేయ డం కేసీఆర్ పాలనాదక్షతకు నిదర్శనమని పేర్కొన్నారు. దళితుల బతుకుల్లో వెలుగులు నింపాలనే కేసీఆర్ సంకల్పం గొప్పదని కీర్తించారు. తెలంగాణలో దళితబంధు ఓ విప్లవమని ప్రశంసించారు.
ఆకాశమంత అంబేద్కర్కు ప్రపంచ రికార్డు మంత్రి కొప్పులకు సర్టిఫికెట్ అందజేసిన హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ హైదరాబాద్ నడిబొడ్డున ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేద్కర్ భారీ విగ్రహం ప్రపంచ రికార్డులకు ఎక్కింది. హుస్సేన్సాగర్ తీరంలో 125 అడుగుల ఎత్తయిన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ కొనియాడింది. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ను సీఎం కేసీఆర్ పేరిట మంత్రి కొప్పుల ఈశ్వర్కు శనివారం అందజేసింది. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అంబేద్కర్ విగ్రహానికి స్థానం లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, జగిత్యాల జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్, హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ డైరెక్టర్లు శ్రీకాంత్, సుమన్ పల్లె పాల్గొన్నారు.
ఓట్లకు ముడిపెట్టొద్దు
అంబేద్కర్ విగ్రహాన్ని ఓట్లతో ముడిపెట్టొద్దు. ఓట్లకు విగ్రహానికి సంబంధాన్ని పెట్టడం అంటే అంబేద్కర్ ఇజాన్ని చులకన చేయడమే. అనేక పోరాటాలకు, మార్పులకు తెలంగాణ స్ఫూర్తి. ఆ స్ఫూర్తి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహ రూపంలో దేశానికి కండ్లకు కడుతుంది. విగ్రహాన్ని పాజిటివ్ దృక్పథంతో అర్థం చేసుకోవాలి.
– డాక్టర్ జిలుకర శ్రీనివాస్, దళితమేధావి
ప్రవచనాల దగ్గరే ఆగలేదు
అంబేద్కర్ ప్రబోధించిన ఆశయాలను తెలంగాణ ప్రచవనాల వరకే పరిమితం చేయకుండా చాలావరకు ఆచరణలో పెడుతున్నది. అంబేద్కర్ ఆలోచనల్లోని ప్రత్యామ్నాయ నమూనాను తెలంగాణ దేశానికి చెప్పాలనుకున్నది. ఈ విగ్రహావిష్కరణ అన్నది సామాజిక పరివర్తన ప్రక్రియలో మైలురాయిగా నిలిచిపోతుంది.
– వల్లంపట్ల నాగేశ్వర్రావు, సామాజికవేత్త
దేశమంతా దళితబంధు సాహసోపేతం
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే దేశమంతా దళితబంధు అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించడం సాహసోపేత నిర్ణయం. ఏటా 25 లక్షల మందికి దళితబంధు పథకం అమలు చేయాలనే దిశగా బీఆర్ఎస్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నది. దేశంలో ఇప్పటివరకు అమలైన పథకాలకు దళితబంధు తలమానికం.
– శ్రీప్రసాద్, రాజకీయ విశ్లేషకుడు, అమరావతి
అంబేద్కర్కు ఆచరణాత్మక నివాళి
అంబేద్కర్కు కేసీఆర్ ఆచరణాత్మక నివాళి అర్పించారు. దేశ రాజకీయాల్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చరిత్రాత్మకం. దళితబంధు అమలుతో దేశ దళితజాతే కాకుండా యావత్తు రాజకీయ ప్రపంచమంతా తెలంగాణను గమనిస్తున్నది. అంబేద్కర్ ఆశయాలు, కలలు తెలంగాణలో సాకారం అవుతున్నాయి. అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ కూడా దళితబంధును ప్రశంసించారు.
– మల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధవనం ప్రాజెక్టు, స్పెషల్ ఆఫీసర్