వెల్గటూర్, డిసెంబర్ 2: వైఎస్ కుటుం బం నుంచి వచ్చిన షర్మిల అవినీతి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవాచేశారు. షర్మిల పాదయాత్ర బీజేపీ కనుసన్నల్లో జరుగుతున్నదని ఆరోపించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో మంత్రి కొప్పుల శుక్రవారం పర్యటించారు. ఎండపల్లి మండలంలోని గుల్లకోట, వెల్గటూర్ మండలంలోని జగదేవ్పేట గ్రామాల్లో రూ.1.5 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించారు. రాజారాంపల్లిలో ముంబైకి చెందిన చోటా మహారాజన్ సంస్థ నుంచి ప్రాంచైజీ ద్వారా 100 సీట్ల సామర్థ్యంతో ఇగ్లూ మోడల్లో నిర్మించిన మినీ థియేటర్ను ప్రారంభించారు. అనంతరం 36 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. అబద్ధాల బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, స్కామ్ల కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డివి కుళ్ల్లు రాజకీయాలని, వారి మాటల్లో నిజం లేదని దుయ్యబట్టారు. అలాంటి వారికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. దేశంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు నడుపుతున్న రాష్ర్టాల కన్నా అన్ని రంగాల్లో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని చెప్పారు. ప్రతిపక్షాలు పబ్బం గడపుకొనేందుకే రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.