హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి చెందిన విద్యార్థినీ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్లు హర్షం వ్యక్తం చేశారు, విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు, అధ్యాపకులు, సిబ్బందిని అభినందించారు.
ఎస్సీ గురుకులాలకు చెందిన ఫస్టియర్ విద్యార్థులు 88.03 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, స్టేట్ సరాసరి 64.25 శాతం మాత్రమే. ఫస్టియర్ పరీక్షలకు 11,999 మంది హాజరు కాగా, వీరిలో 10,563 మంది పాసయ్యారు. 17కాలేజీలు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాయి. సెకండియర్లో స్టేట్ సరాసరి 68.68 శాతం కాగా,ఈ సొసైటీకి చెందిన విద్యార్థులు 93.23 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలకు 11,456 మంది హాజరు కాగా, వీరిలో 10,680 మంది పాసయ్యారు. 41 కాలేజీలు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాయి.