నల్లగొండ : టీఆర్ఎస్ పార్టీ డబ్బుతో రాజకీయాలు చేయదని, ప్రజల మద్దతు ఉన్న పార్టీ అని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరు మండలం బోడంగిపర్తిలో కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీకి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను డబ్బుతో కొంటున్నాయని ఆరోపించారు. ఈ ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని స్పష్టం చేశారు. బీజేపీ పాలనలో దళితులపై దాడులు పెరిగాయన్నారు.
మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఫ్లోరోసిస్ నుంచి కేసీఆర్ శాశ్వత విముక్తి కల్పించారని తెలిపారు. గత పాలకులు నల్లగొండ జిల్లాను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు కాబట్టే.. రాష్ట్ర ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఆ పథకం ద్వారా ఇంటింటికి సురక్షిత తాగునీరు అందిస్తున్నారని పేర్కొన్నారు.
రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారో అందరికీ తెలుసన్నారు. కేవలం కాంట్రాక్టుల కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ప్రజలు గ్రహించాలని కొప్పుల ఈశ్వర్ సూచించారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి, కేసీఆర్కు బహుమతిని ఇద్దామని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.