హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ప్రజల్లో సానుభూతి కోసమే 2018 ధర్మపురి ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అడ్లూరి లక్ష్మణ్ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అంశం కోర్టు పరిధిలో ఉన్నా లక్ష్మణ్ ఆరోపణలు చేయడం తగదని సూచించారు. లక్ష్మణ్ వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకుండానే రాజకీయ దురుద్దేశంతో కౌంటింగ్లో ఏదో తేడా ఉందని లక్ష్మణ్ ఆరోపిస్తున్నారని, సానుభూతి కోసమే చేస్తున్నారని మండిపడ్డారు. అడ్లూరి లక్ష్మణ్ అంతటి అబద్ధాలకోరు మరొకరు ఉండరని, ఇకనైనా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలి సూచించారు. తనపై పదేపదే పొంతన లేని విమర్శలు చేయడం మానుకోవాలని మంత్రి హెచ్చరించారు.