జగిత్యాల రూరల్, నవంబర్ 20: దివ్యాంగుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.3,016 పెన్షన్ను ఇస్తున్నదని ఎస్సీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాలలోని మినీ స్టేడియంలో జిల్లా దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 40 మందికి రిట్రో పిట్టెడ్ మోటర్ వాహనాల (మూడు చక్రాల స్కూటీలు)ను అందజేశారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్లో దివ్యాంగులకు రూ.5 కోట్లు కేటాయించే వారని, కానీ స్వరాష్ట్రంలో రూ.60 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రూ.3,016 పెన్షన్ ఇస్తున్నట్టు తెలిపారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో రూ.950 మాత్రమే ఇస్తున్నారని గుర్తుచేశారు. దివ్యాంగుల ఆర్థికాభివృద్ధికి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు అందజేస్తున్నామన్నారు. దివ్యాంగుల శాఖ శిశు సంక్షేమ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్నదని, సీఎం కేసీఆర్తో మాట్లాడి దివ్యాంగుల కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. డిసెంబర్ 3న దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ జి రవి తదితరులు పాల్గొన్నారు.