నిజామాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిరుద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సెంటర్(న్యాక్)ను ఏర్పాటు చేసింది. రూ.6.15 కోట్లతో నిర్మించిన న్యాక్ భవనాన్ని బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ప్రారంభించనున్నారు. నగరంలోని సమీకృత కలెక్టరేట్, ఐటీ టవర్కు ఆనుకొని దీన్ని నిర్మించి, జిల్లా నైపుణ్య అభివృద్ధి కేంద్రంగా నామకరణం చేశారు. ఎన్ఏసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో ఉన్నది. దాని కేంద్రం జగిత్యాలలో ఉండగా, ఇప్పుడు నిజామాబాద్లోనూ ఏర్పాటైంది. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొన్నారు.
నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా
నిజామాబాద్లోని న్యాక్ కేంద్రంలో అధునాతన సౌకర్యాలను కల్పిస్తున్నారు. 5 స్మార్ట్ క్లాస్ గదులు, 3 ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్, 120 మంది అభ్యర్థులకు భోజన సౌకర్యానికి వీలుగా వసతి గృ హం, కౌన్సెలింగ్ గది, ప్లేస్మెంట్ రూమ్, 8 కార్యాలయ గదులను నిర్మించారు. జీ ప్లస్ 2 పద్ధతిలో, ప్రతి ఫ్లోర్ 12,519 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా మొత్తం 37,557 చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చింది. మేసన్ జనరల్, అసిస్టెంట్ బార్ బెండర్ అండ్ స్టీల్ ఫిక్చర్, షట్టరింగ్ కార్పెంటరీ, కన్స్ట్రక్షన్ పెయింటర్ అండ్ డెకోరేటర్, అసిస్టెంట్ టెక్నీషియన్ డ్రై వాల్ అండ్ ఫాల్స్-సీలింగ్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్ (జనరల్), అసిస్టెంట్ సర్వేయర్, అసిస్టెంట్ వర్క్ సూపర్వైజర్, ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డర్, అసిస్టెంట్ స్టోర్ కీపర్ అండ్ స్టోర్ కీపర్, సూపర్వైజర్ స్ట్రక్చర్, టైలరింగ్ వంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తారు.
మరిన్ని ప్రారంభోత్సవాలు
మంత్రి కేటీఆర్ పర్యటనలో భాగంగా న్యాక్తో పాటు నగరంలో రూ.15.5 కోట్లతో నిర్మించిన మూడు అధునాతన వైకుంఠధామాలు, రూ.14 కోట్లతో ట్యాంక్బండ్గా సుందరీకరించిన రఘునాథ చెరువును, రూ.7 కోట్లతో నిర్మించిన నగరపాలక సంస్థ నూతన బిల్డింగ్, రూ.50 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ను ప్రారంభిస్తారు.
నిరుద్యోగ యువతకు దిక్సూచి న్యాక్
రూ.6.15 కోట్లతో అత్యాధునిక వసతులతో నిజామాబాద్లో న్యాక్ భవనాన్ని నిర్మించాం. బైపాస్కు ఆనుకుని సమీకృత కలెక్టరేట్, ఐటీ టవర్, ఆ పక్కనే న్యాక్ భవనాన్ని నిర్మించాం. ఇది నిరుద్యోగ యువతకు ఆశాకిరణం లాంటిది. ఉమ్మడి జిల్లా నిరుద్యోగ యువతతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపయోగపడుతుంది.
– వేముల ప్రశాంత్ రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి