హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ)/మెహిదీపట్నం: బీఆర్ఎస్ పార్టీ తన మానవీయతను మరోసారి చాటుకున్నది. ఇటీవల రాజస్థాన్లోని జైపూర్ సమీపంలో రైల్లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించిన విషయం తెలిసిందే. ఆ నలుగురిలో ఒకరు హైదరాబాద్ రెడ్హిల్స్ డివిజన్ బజార్ఘాట్కు చెందిన సయ్యద్ సైఫుద్దీన్ ఉన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ శుక్రవారం సభ దృష్టికి తేగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించి ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే. హామీ ఇచ్చిన తెల్లారే బీఆర్ఎస్ సైఫుద్దీన్ కుటుంబానికి ఇచ్చిన మాటను నిలబటెట్టుకున్నారు. శనివారం సైఫూద్దీన్ భార్య అంజుమ్ షాహిన్కు కుడా (కులీకుతుబ్షా అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్)లో ఉద్యోగ ఆర్డర్ కాపీ, వితంతు పింఛన్ మంజూరు పత్రంతోపాటు ముగ్గురు ఆడ పిల్లలకు ఒకొకరికీ రూ.2 లక్షల చొప్పున రూ.6 లక్షల చెక్కును మంత్రి కేటీఆర్ అందజేశారు. జియాగూడలో డబుల్ బెడ్రూం ప్లాట్ ఇవ్వాలంటూ ఆసిఫ్నగర్ తహసిల్దార్కు ఉత్తర్వులు జారీచేసిన పత్రం కూడా ఇచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మంత్రి కేటీఆర్ చాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఔదార్యానికి, మంత్రి కేటీఆర్ తక్షణ స్పందనకు ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కృతజ్ఞతలు తెలిపారు.