సూర్యాపేట : యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సూర్యాపేటలో రాబోయే పాలన ఉండబోతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) పేర్కొన్నారు. సోమవారం కుడకుడ గ్రామంలో అంత్యోదయ మహిళా పరస్పర సహకార పొదుపు సంఘం సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. అనంతరం సూర్యాపేట కార్పెంటర్స్ నూతన కార్యవర్గ పదవీ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత రెండు పర్యాయాలు సూర్యాపేట ప్రజలకు ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చామని అన్నారు. సూర్యాపేటలో పారిశ్రామిక హబ్ నెల కొల్పడమే తన భవిష్యత్ లక్ష్యం ఆన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దన్న మంత్రి కాంగ్రెస్ గెలుపొందడం అంటే..తోడేళ్ల మంద గొర్రె పిల్లలపై పడటమే అన్నారు.
గత మ్యానిఫెస్టోలను నూటికి నూరు శాతం అమలు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే మహిళా సంఘాల అభివృద్ధి జరిగిందన్న మంత్రి పనిచేసే ప్రభుత్వానికి సబ్బండ వర్గాలు అండగా నిలబడాలని కోరారు. మరోసారి శాసన సభ్యుడిగా ఆశీర్వదించండి… సేవకుడిగా పనిచేస్తానని హామినిచ్చారు.అనంతరం సుమంగళి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.