దేవరకొండ, నవంబర్ 3: అరవయ్యేండ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని ఓట్లు అడుగడానికి వస్తున్న ఆ పార్టీ నాయకులను నిలదీయాలని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండ జిల్లా దేవరకొండలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కాంగ్రెసకు ఓటేస్తే.. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్తు బందవుతాయని హెచ్చరించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలు నమ్మరని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో పోటీ చేయని
కాంగ్రెస్ నాయకుడు.. తాను ముఖ్యమంత్రి అవుతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో పదిమంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని, వారి కొట్లాటలతోనే సరిపోతుందని, ప్రజల బాగోగులను పట్టించుకునే పరిస్థితి ఉండదని వివరించారు. మూడో సారి ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న 93 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందించే కార్యక్రమం చేపట్టనున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రాగానే రూ.400లకే గ్యాస్ సిలిండర్ అందిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో దేవరకొండ ఎమ్మెల్యే
రమావత్ రవీంద్రకుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, కేతావత్ బీల్యానాయక్, వడ్త్య రమేశ్నాయక్, హన్మంత్ వెంకటేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.