సూర్యాపేట : వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ కాంగ్రెస్ జాతీయ విధానమే. రాష్ట్రంలో కరెంటు లేదని ఒక్క రైతు అయినా రోడ్డెక్కాడా? గత కాంగ్రెస్లో కరెంటు కోసం సబ్ స్టేషన్లు ధ్వంసం చేసి రోడ్లమీద రైతులు రాస్తారోకోలు చేశారు. వీటిని తప్పించుకునే ప్రయత్నంలోనే కాంగ్రెస్ బుకాయింపు చర్యలకు పాల్పడుతున్నదని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి ఫైర్ అయ్యారు.
కరెంట్ ఫైల్స్ తీస్తామన్న రేవంత్ రెడ్డి కామెంట్స్ పై సూర్యాపేటలో మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ఫైల్స్ మా కాడ సిద్ధంగానే ఉన్నాయి. రేవంత్ రెడ్డి, బాసులు , పాత బాసుల ఫైల్స్ తీయడానికి రెడీగా ఉన్నామన్నారు. ప్రజల ముందు ఎలాంటి ఫైల్స్ పై చర్చకైనా మేం సిద్ధమేనని స్పష్టం చేశారు.
కరెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ దొరికిన దొంగ. 2014 ముందు మన వ్యవసాయం ఎలా ఉంది? రెండో పంట పండించిన భూములు ఎంత ? సాగునీళ్లు కాదు కదా తాగునీళ్లకే దిక్కు లేక ప్రజలు నానా కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు తమ కష్టంతోని బోర్లు వేసుకొని మోటర్లు కొనుకొచ్చుకొని కరెంట్ కోసం నానా అగచాట్లు పడిన రోజులను రైతులు మర్చిపోరన్నారు. కాంగ్రెస్ దుర్మార్గాలకు నాశనమైన రైతులకు నల్లగొండ జిల్లానే సాక్ష్యమని తెలిపారు.
ఫ్లోరోసిస్ పాపం కాంగ్రెస్ది కాదా? అని సూటిగా ప్రశ్నించారు. రైతుల చైతన్యం ముందు కాంగ్రెస్ కలలు, జిమ్మిక్కులు ఫలించవని, ప్రతి రైతు కాంగ్రెస్ కుట్రల పై చర్చించాలన్నారు. ఏఐసీసీ విధానాన్నే టీపీసీసీ పాటిస్తుందపి మండిపడ్డారు. మూడు గంటల కాంగ్రెస్ను నిలదీయండి .మూడు పంటల కేసీఆర్ వెంట నడువాలని రైతులకు పిలుపునిచ్చారు.
రేపటి నుండి పెద్ద ఎత్తున రైతు వేదికల వద్ద కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతామన్నారు. ఏఐసీసీ దిగొచ్చినా కాంగ్రెస్ ఇక రైతుల నుంచి తప్పించుకోలేదని పేర్కొన్నారు. కరెంట్ కొనే విధానం పై కాంగ్రెస్ నాయకులకు కనీస అవగాహన లేకపోవడం శోచనీయమన్నారు. నయవంచక కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.