సూర్యాపేట : స్వరాష్ట్రంలో సాగు భూములు సస్యశ్యామలంగా మారాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagdish Reddy ) అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావానికి పూర్వం జిల్లాలో 3 లక్షల 42 వేల 465 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పంట సాగు 2023 నాటికి ఆరులక్షల 18 వేల 105 ఎకరాలకు విస్తరించడమే ఇందుకు తార్కాణమని వెల్లడించారు. నాలుగు లక్షల 16 వేల 500 మెట్రిక్ టన్నుల దిగుబడి నేడు 12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి ఎదిగి రికార్డ్ సృష్టించిందని వివరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి అందుతున్న జలాలతోటే సూర్యాపేట జిల్లా సస్యశ్యామలంగా మారిందన్నారు. అమరుల త్యాగఫలం తోనే అందరమూ స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్నామన్నారు. ప్రభుత్వం అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ యావత్ భారతదేశానికి రోల్ మోడల్ గా మారిందన్నారు.
విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు
విద్యుత్ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకోచ్చామని మంత్రి పేర్కొన్నారు. ఆ ఘనత ముమ్మాటికి ముఖ్యమంత్రి కేసీఆర్దే నన్నారు. యావత్ భారతదేశంలో వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణనేనని పేర్కొన్నారు. పట్టణాలతో సరి సమానంగా పల్లెలలో ప్రగతి పరుగులు పెడుతుందని వివరించారు. జాతీయ స్థాయిలో పొందిన ఉత్తమ పట్టణ ,పంచాయతీ అవార్డులలో మొదటి 19 వరుసలో తెలంగాణ ఉండడమే ఇందుకు అద్దం పడుతోందన్నారు.
వైద్య రంగంలోనూ..
వైద్య రంగంలో ముందెన్నడూ లేని విధంగా కంటి వెలుగు, కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్లను ప్రవేశ పెట్టడంతో పాటు ఆరోగ్యశ్రీకి 214.30 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దళితులు ఆర్ధికంగా ఎదిగేందుకు దళిత బంధును పకడ్బందీగా అమలు చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.