అగ్నిపథ్ స్కీంను ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో ఆందోళనలు మొదట మొదలైంది బీజేపీ పాలిత రాష్ట్రాలనుంచే అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జీ జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. అందుకు కొనసాగింపే శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటనలు అని ఆయన తేల్చిచెప్పారు. బీజేపీ నుంచి ఎదురయ్యే ప్రమాదాన్ని గ్రహించిన యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుందని చెప్పారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
అగ్నిపథ్ ఆందోళనలు మరింత ముదరక ముందే మోడీ సర్కారు ఈ స్కీంను ఉపసంహరించుకోవాలని మంత్రి జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. ఇది అగ్నిపథ్పై జరుగుతున్న పోరాటంగా కనిపిస్తున్నప్పటికీ బీజేపీ పాలనపై రగిలిపోతున్న యువత ఈ రూపంలో తన ఆగ్రహాన్ని చూపించిందని అర్థమవుతోందన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్న మోడీ ఎన్నికల వాగ్దానం అమలుకు నోచుకోకపోవడం కుడా కట్టలు తెంచుకున్న యువత ఆగ్రహానికి ఒక కారణంగా కనిపిస్తోందన్నారు. యువత జీవితాలతో ఆడుకోకుండా మోదీ సర్కారు వెనక్కి తగ్గాలని కోరారు.