ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో విద్యుత్ రంగం సంక్షోభంలోకి వెళ్లిపోయిందని, దేశం చీకట్లోకి నెట్టేలా ఆ నిర్ణయాలున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. విద్యుత్ రంగంలో కేంద్ర సర్కారు తీసుకొస్తున్న సంస్కరణలు ఆ రంగానికి ఉరి తాళ్లుగా మారనున్నాయని హెచ్చరించారు. ఆ సంస్కరణలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రజలు ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం మంత్రి జగదీశ్రెడ్డి మీడియాతో మాట్లాడారు.
దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే కుట్రలకు కేంద్ర సర్కారు తెరలేపిందని మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. అదే జరిగితే దేశం చీకటైపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కార్పొరేట్ సంస్థలకు విద్యుత్ సంస్థలను కట్టబెట్టేందుకే కుట్ర పూరితంగా సంస్కరణలను ముందుకు తెచ్చారని మండిపడ్డారు. జాతీయ ఉత్పత్తులను ఏనాడూ ప్రోత్సహించిన చరిత్ర బీజేపీ పాలకులకు లేదన్నారు. వ్యవసాయ చట్టాలు తెచ్చి పంట పొలాలను కార్పొరేట్లకు అంటగట్టే ప్రయత్నం చేశారని, ఇప్పుడు విద్యుత్ సంస్కరణల పేరుతో ఆ కార్పొరేట్లకు విద్యుత్ సంస్థలను అప్పగించాలని చూస్తున్నారన్నారు. వ్యవసాయ చట్టాలను తెచ్చిన రోజున యావత్ రైతాంగం చేసిన తిరుగుబాటును ఆయన గుర్తు చేశారు. అదే తిరుగుబాటు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా కూడా చేయాలని మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు.