Minister Jagadish Reddy | రాష్ట్రంలో సమర్థవంతంగా పాలన జరుగుతుందని, ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిదేళ్లుగా ఎలాంటి కరువు ఆటకాలు లేవని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని వేంకటేశ్వరస్వామి, వేదాంత భజన మందిరం ఆలయాల్లో వేద పండితులు నిర్వహించిన పంచాంగ శ్రవణంలో మంత్రి పాల్గొన్నారు. రాశి, నామ నక్షత్రాలను అనుసరించి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాలు, అవమానాలను ప్రజలు తెలుసుకున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని, మంచి వర్షాలు పడతాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని రాష్ట్రం, దేశమంతా సస్యశ్యామలంగా ఉంటుందన్నారు.
ధరలు నిలకడగా ఉండే అవకాశం ఉందని వేదపండితులు పంచాంగం వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుభిక్షంగా ఉందని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం కూడా రాష్ట్రం,ఉమ్మడి నల్లగొండ జిల్లా మరింత సుభిక్షంగా ఉంటాయని అన్నారు. పాడి పంటలు, సమృద్ధి వర్షాలతో సస్యశ్యామలంగా ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. కేసీఆర్ దార్శనికతతో రాష్ట్ర పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని చెప్పారు.
నూతన తెలుగు సంవత్సరం సందర్భంగా తీసుకునే నిర్ణయంలో భాగంగా ఈ సంవత్సరం సూర్యాపేట నియోజకవర్గ, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు మరింత అందుబాటులో ఉండి మరింత సమయాన్ని కేటాయిస్తానన్నారు. జరుగుతున్న అభిృవృద్ధి యజ్ఞంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. సూర్యాపేట నియోజక వర్గానికి శోభకృత్లో అన్నీ శుభాలే కలుగుతాయన్నారు. శోభకృత్ నామ సంవత్సరం జిల్లాకు నూతన శోభ వాటిల్లుతుందని, మరింత అభివృద్ధి పథంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా దూసుకుపోతుందని మంత్రి జగదీశ్రెడ్డి ఆకాంక్షించారు.