Minister Jagadish Reddy | మారుతూ వస్తున్న సాంకేతికతకు అనుగుణంగా న్యాయవాదులు స్టడీ చెయ్యాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కోర్టులో జరిగిన న్యాయవాదుల వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు పాల్గొన్న.. ఈ కార్యక్రమానికి బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నేతి రఘుపతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
అదే విధంగా రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తరుచుగా ప్రమాదాలకు కారణమవుతున్న సంస్థలను గుర్తించి వారిలో అవగాహన కలిగించాలన్నారు. అందుకు న్యాయమూర్తులు న్యాయవాదులకు ప్రోత్సాహం కల్పించాలని ఆయన కోరారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోనీ కోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తులకు శాశ్వతంగా నివాస భవనాలు నిర్మించే విషయాన్ని పరిశీలనలోకి తీసుకుంటామన్నారు. అనంతరం న్యాయవాద వృత్తిలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సీనియర్ న్యాయవాదులు కొలనుపాక మురళీధర్ రావు, బీ రామిరెడ్డిని మంత్రి జగదీశ్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్, జిల్లా న్యాయమూర్తి నాగరాజు ఘనంగా సత్కరించారు.