నల్లగొండ : నల్లగొండ కాంగ్రెస్ నాయకులు వృద్ద జంబుకాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. వారి హయాంలోనే జిల్లాలో ఫ్లోరోసిస్, కరువు పెరిగిందని ఆరోపించారు. జిల్లాలోని మిర్యాలగూడెం నియోజక వర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) స్ధానిక శాససభ్యులు భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగదీష్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎన్నడూ కాంగ్రెస్ నాయకులు(Congress Leaders) ప్రశ్నించలేదని దుయ్యబట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవులు, బీ ఫారాల కోసం నాటి నాయకులు అధిష్టానం వద్ద నోరు మెదపలేదని ఆరోపించారు. వరుసగా 16 ఎండ్లు పంట పొలాలు ఎండ బెట్టింది వీరి పాలనలోనే విమర్శించారు. మరో వైపు డబుల్ ఇంజిన్ సర్కార్ బీజేపీ(BJP)) పాలన లో 35 నుంచి 40 శాతం పస్తులే ఉంటున్నారని తెలిపారు.
తెలంగాణాలో అభివృద్ధి అంటే 2014 కు ముందు వెనుక చూడాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) అధికారంలోకి వచ్చాకే ఎడమ కాలువకు వరుసగా 16సార్లు
నీరు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. కేసీఆర్ పాలనలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంటలు సమృద్ధిగా పండుతున్నాయని ఆయన వెల్లడించారు.
ఎత్తు, లావు, పొడుగు ఉన్న వారి పాలనలో కాంగ్రెస్ ఏనాడు కూడా 6 స్థానాలకు మించి గెలవలేదని కేసీఆర్ హయాంలోనే అన్ని స్థానాలు బీఆర్ఎస్ గెలిచి చరిత్ర సృష్టించదని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ అన్ని స్థానాల్లో విజయదుందుభి మ్రోగిస్తామని ధీమాను వ్యక్తం చేశారు.