సూర్యాపేట టౌన్, మే 2: సూర్యాపేటలో సకల సౌకర్యాలతో బ్రాహ్మణ అపరకర్మశాల నిర్మించ తలపెట్టినట్టు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. ఇందుకు 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, సీఎం ప్రత్యేక నిధుల నుంచి రూ.20 లక్షలు మంజూరైనట్టు చెప్పారు. సూర్యాపేటలో నూతనంగా నిర్మించ తలపెట్టిన బ్రాహ్మణ అపరకర్మశాల భవన సముదాయానికి సోమవారం మంత్రి శంకుస్థాపన చేసి, మాట్లాడారు. స్నానపు ఘట్టాలు, భోజనశాలలతో పాటు వారి ఆచార వ్యవహారాలు ఉట్టిపడేలా అపరకర్మశాల నిర్మాణం ఉంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్ వచ్చినంకనే బ్రాహ్మణులకు ఆదరణ పెరిగిందని స్పష్టంచేశారు. ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలు, పూజారులకు గౌరవ వేతనం ఇస్తున్నారని చెప్పారు. స్వరాష్ట్రంలో తెలంగాణలోనే కృష్ణా, గోదావరి పుష్కరాలు నిర్వహించడమే కాకుండా ఆయా పుష్కరాల్లో బ్రాహ్మణులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.