సూర్యాపేట: ఆటలు ఆరోగ్యానికే కాదు సమాజానికి కూడా మేలు చేకూరుస్తాయని నమ్మే నాయకుడు సీఎం కేసీఆర్ (CM KCR) అని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. క్రీడల (Sports) వల్ల దేహదారుడ్యంతోపాటు స్నేహ సంబంధాలు మెరుగుపడతాయని చెప్పారు. ప్రతిఒక్కరు చిన్ననాటి నుంచే క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని సూచించారు. ప్రపంచ ఒలింపిక్ రన్ (Olympic run day) దినోత్సవాన్ని పురస్కరంచుకుని సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఒలింపిక్ రన్ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి ప్రారంభమైన పరుగు ఎంజీ రోడ్డు, శంకర్ విలాస్ సెంటర్ మీదుగా ట్యాంక్బండ్ వరకు 2 కిలోమీటర్ల మేర సాగిన ఈ రన్లో వందలాదిమంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దశాబ్ద కాలంలో క్రీడా రంగంలో స్పష్టమైన మార్పు వచ్చిందన్నారు. ఆటలకు అందలమిస్తున్న ప్రభుత్వం దేశంలో బీఆర్ఎస్ సర్కార్ మాత్రమేనని చెప్పారు. స్టేడియాలు, క్రీడా ప్రాంగణాల నిర్మాణం అందులో భాగమన్నారు.
క్రీడాభివృద్ధిలో దేశానికి దిక్సూచి తెలంగాణ అన్నారు. ప్రతి ఒక్కరూ చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచే వివిధ విభాగాల్లో మంచి ప్రతిభ కనబరచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. తెలంగాణలో క్రీడలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నాయని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని తెలిపారు.
మిగతా రంగాల్లో వలే క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తూ దేశంలో మొదటి స్థానంలో నిలుపాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనలతో ప్రభుత్వం ముందుకెళుతున్నదని వెల్లడించారు. గడిచిన దశాబ్ద కాలంలో రాష్ట్ర క్రీడారంగంలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నదని మంత్రి చెప్పారు. క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు స్టేడియాల నిర్మాణం, గ్రామీణ క్రీడా ప్రాంగణాలను భారీ ఎత్తున ఏర్పాటు చేశామన్నారు.