సూర్యాపేట : విద్యుత్ అంశంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రలు పరాకాష్టకు చేరుకొని తెలంగాణ ప్రజల గొంతు నొక్కుతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి ధ్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రధాని మోదీ కొత్త కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్లలో కేంద్రానికి ఎన్ఎల్డీసీ, ఎస్ఎల్డీసీల ప్రమేయం ఏమాత్రం ఉండదన్నారు.
అయితే ఉత్పత్తి దారులకు డిస్కం లేదా ట్రాన్స్కో, జెన్కోల మధ్య కుదిరే ఒప్పందం మాత్రమే ఉంటుందని మంత్రి గుర్తు చేశారు. ఎలాంటి సంబంధం లేకున్నా కేంద్రం తల దూరుస్తు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయొద్దని ఆదేశాలు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజల పట్ల బీజేపీ ఏ స్థాయి కక్ష పెంచుకుందో అర్థం అవుతుందన్నారు.
విద్యుత్ సరఫరా దారులు, తెలంగాణకు మధ్య ఒప్పందాలు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా తేడా వస్తే ఇరువర్గాలు పరిష్కరించుకుంటాయని, అయితే ఎలాంటి సంబంధం లేని కేంద్రంలోని బీజేపీ పాలకులు మధ్యలో దూరి చేసే దాదాగిరి వీధి రౌడీలను మర్పిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేంద్రం దిగజారుడు తనానికి నిదర్శనమని, లేని అధికారాలు తీసుకుని బెదిరింపులకు పాల్పడుతుందన్నారు.
మోదీ సొంత రాష్ట్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలలో విద్యుత్ సరఫరా చెయ్యలేకనే ఈ కుట్రలు పన్నుతురన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కేంద్రం కుట్రలను అమలు పరిచేందుకే విద్యుత్ సరఫరా దారులపై కేంద్రం వత్తిడి చేస్తుందని ఎంత ఖర్చు అయినా సరే విద్యుత్ సరఫరాకు ఆటంకం రానివ్వమన్నారు. అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించామని మంత్రి తెలిపారు.