నాంపల్లి, ఆగస్టు 26 : రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, నమ్మి ఓట్లేసిన మునుగోడు ప్రజలను వంచించిన ఘనుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని ముష్టిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి లక్ష్మయ్యతోపాటు మరో 50 మంది కార్యకర్తలు శుక్రవారం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. నమ్మిన ప్రజలను మోసం చేయడంలో కోమటిరెడ్డి బ్రదర్స్కు పెట్టింది పేరన్నారు. గతంలో తెలంగాణ నుంచి కడపకు వైఎస్ రాజశేఖర్రెడ్డి అక్రమంగా నీళ్లను తీసుకుపోతుంటే వీరు ఆయనకు వంతపాడారని విమర్శించారు. అభివృద్ధి కోసమే అయితే.. కాంగ్రెస్కు చెందిన మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయ డం లేదని ప్రశ్నించారు. రూ.22 వేల కోట్ల కాంట్రాక్టుల కోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన రాజగోపాల్రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. బీజేపీకి ఓట్లు వేస్తే మోటర్లకు మీటర్లు పెట్టి రైతుల బతుకులను ఆగం చేస్తారని ఆరోపించారు. కుల, మతాల పేరుతో మనుషుల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలనుకొనే బీజేపీకి డిపాజిట్ దక్కనీయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేండ్లు అయినా కేంద్రం కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా తెలంగాణకు అన్యాయం చేస్తున్నందుకా రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరాడని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పులిపలుపులలో 30 కుటుంబాలు..
మునుగోడు మండలంలోని పులిపలుపుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులతోపాటు 30 కుటుంబాల వారు శుక్రవారం మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.