సూర్యాపేట, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర డిస్కంలు ఏపీ ప్రభుత్వానికి రూ.6,700 కోట్లు ఇవ్వాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం కేవలం రాజకీయ దురుద్దేశం తప్ప మరొకటి కాదని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. విద్యుత్తు రంగంలో తాను సాధించలేనిది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించారని దుగ్ధతో బీజేపీ ఏడాది కాలంగా రాష్ట్రంలో విద్యుత్తు రంగా న్ని చీకట్లలోకి నెట్టే కుట్రలు పన్నుతున్నదని అన్నారు. అందులో భాగంగానే తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఏపీ ప్రభుత్వ డిస్కంలు, ట్రాన్స్కో, జెన్కోల నుంచి తెలంగాణకు రూ.12,941 కోట్లు రావాల్సి ఉన్నదని పలు సందర్భాల్లో కేంద్రం దృష్టికి, కేంద్రంలోని పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి పలు సందర్భాల్లో తీసుకువెళ్లినా పెడచెవిన పెట్టారని అన్నారు.
అదే నేడు ఏపీ అడుగుతున్నదని ఏకపక్ష ఉత్తర్వులు జారీ చేయడం రాజకీయ దురుద్దేశ చర్య కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం జారీచేసిన ఉత్తర్వులపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్ సంస్థల్ని ఇబ్బందులు పెట్టడానికి ఏడాది కాలంగా కేంద్ర సంస్థలు, విద్యుత్ మంత్రిత్వ శాఖ, స్వయంగా ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని, దానికి కొనసాగింపే ఈ ఉత్తర్వులని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. వాస్తవానికి 2014 ఎన్నికలకు ముందు మోదీ దేశమంతటా తిరుగుతూ గుజరాత్ను అద్భుతంగా అభివృద్ధి చేశానని, బీజేపీని గెలిపిస్తే గుజరాత్ వెలుగులు దేశ వ్యాప్తంగా అందిస్తానని ప్రజల్ని నమ్మించారని చెప్పారు. కాగా నేడు మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో రైతాంగానికి కరెంటు కేవలం 6 గంటలే ఇస్తుండగా.. పరిశ్రమలకు వారంలో రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించారని అన్నారు. ప్రస్తుతం గుజరాత్, అహ్మదాబాద్, గాంధీనగర్తో పాటు అన్ని రాష్ట్ర రాజధానుల్లో విద్యుత్ కోతలు ఉండగా విద్యుత్ కోతల్లేని రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే అన్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా రెండేండ్లు దేశంలో విద్యుత్, బొగ్గు సంక్షోభాలను చవిచూసిందని, కానీ తెలంగాణలో మాత్రం అలాంటి సమయంలో కూడా 24 గంటల విద్యుత్తు ఇచ్చామన్నారు.
వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే..
ఒక వైపు మోదీ డబుల్ ఇంజిన్ సర్కార్లు అని ఊదరగొడుతుండగా దేశంలో ప్రస్తుతం ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్లు పూర్తిగా వైఫల్యం చెందాయని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేవలం మూడేండ్లలోనే అద్భుత విజయాలు సాధించిందన్నారు. ప్రధానంగా విద్యుత్తు విషయంలో 24 గంటల విద్యుత్తును అన్ని రంగాలకు ఇస్తుండగా వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. ఇదే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కోపానికి కారణమని అన్నారు. ఏదో ఒక పద్ధతిలో తెలంగాణకు నష్టం చేకూర్చాలనేది కేంద్రంలోని బీజేపీ తపన అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ఏదో ఒక పద్ధతిలో విద్యుత్ కోతలు విధించాలనే కుట్ర చేస్తున్నదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల మోటర్లకు విద్యుత్తు మీటర్లు బిగించాలని కేంద్రం ఒత్తిడి తెస్తున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ బిగించేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని అన్నారు. దీంతో పాటు సీఎం కేసీఆర్ దేశంలోని వనరులను ఎలా వినియోగించుకోవచ్చో అనేక సందర్భాల్లో దేశం ముందుంచుతుండడం బీజేపీకి మింగుడు పడడం లేదని పేర్కొన్నారు.
దేశంలో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నదని, దానిని ఎలా వినియోగంచవచ్చో, ఇంచు ఇంచు భూమిని ఎలా సాగులోకి తీసుకురావొచ్చో, అలాగే దేశంలోని 4 లక్షల మెగావాట్ల విద్యుత్ను తెలంగాణ రాష్ట్రం మాదిరి దేశం మొత్తానికి ఎలా ఇవ్వొచ్చో సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఇది కూడా బీజేపీ కోపానికి కారణమైమందన్నారు. ఉత్తర్వులు కేవలం రాజకీయ దురుద్దేశంతో ఇచ్చినవి మాత్రమేనన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు రూ.12,941 కోట్లు రావాలి. దీనిపై పలుమార్లు లేఖ ద్వారా చెప్పినా కనీసం స్పందించలేదని చెప్పారు. కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై చట్టబద్ధ సంస్థల్ని అప్రోచ్ అవుతామని, న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. అలాగే సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని రాష్ట్ర, దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లి కేంద్రాన్ని ఎండగట్టే ప్రయత్నం కూడా చేస్తారన్నారు.