సూర్యాపేట టౌన్, నవంబర్ 4: బీజేపీ కుట్రలను ఛేదిస్తూ మునుగోడు ఉప ఎన్నిక ఫలితం చెంపపెట్టులా ఉండబోతున్నట్టు విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ చేసిన కుట్రలను తమ ఎమ్మెల్యేలు ధైర్యంగా తిప్పి కొట్టారని కొనియాడారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు చాకచక్యంగా వ్యవహరించి కుట్రను బయట పెట్టారని, వీరివల్లే దొంగల బండారం ప్రజల ముందు ఉంచామని, నిందితులను తప్పించేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ఈ విషయంలోనూ తమ అజ్ఞాన, రాక్షస రాజకీయాలను ప్రదర్శిస్తూ మరోసారి ప్రజల్లో అభాసు పాలవుతున్నదని బీజేపీపై మండిపడ్డారు. దొరికిన వారు నకిలీ ముఠా అయితే ఒరిజినల్ దొంగలెవరో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. దొరికినవారు ఒరిజినల్ కానప్పుడు నందకుమార్ భార్య ఎందుకు కేసు పెట్టాలో చెప్పాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా అభివృద్ధి చెందుతున్నదని, బీఆర్ఎస్ దేశ రాజకీయాలలో పెనుమార్పులు సృష్టించడం ఖాయమని చెప్పారు. ఇందుకు మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు నాంది కాబోతున్నాయని చెప్పారు. ముందుగా ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లందరికీ, ఇన్ని రోజులుగా పనిచేసిన సహచర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్తో కలసి పని చేసిన వామపక్ష పార్టీల ప్రజా పత్రినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ భిక్షం తదితరులు పాల్గొన్నారు.