హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): మునుగోడు ప్రజల నమ్మకాన్ని అమ్ముకొన్న దొంగ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. మూడేండ్లుగా బీజేపీతో టచ్లో ఉన్నానని, ఆర్నెళ్ల క్రితమే తనకు కాంట్రాక్ట్ వచ్చిందని తనకు తానే చెప్పిన రాజగోపాల్రెడ్డి ఎన్నికల్లో పోటీచేసే నైతిక హక్కును కోల్పోయారన్నారు. ఈ విషయంపై తాము ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్తో కలిసి శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నిక ప్రజల అవసరం కోసం వచ్చింది కాదని.. రాజగోపాల్రెడ్డి స్వార్థంతో రూ.22 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసమే వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీకి అమ్ముడుపోయానని తానే స్వయంగా ఒప్పుకొన్న నేపథ్యంలో రాజగోపాల్రెడ్డికి ఎన్నికల్లో పోటీచేసే హక్కు లేదన్నారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడిన రాజగోపాల్రెడ్డి తానేదో త్యాగం చేసినట్టు పోజులు కొట్టడం సిగ్గుమాలిన తనానికి నిదర్శనమని చెప్పారు. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీకి సమాచారం అందిస్తూ కోవర్ట్ కోమటిరెడ్డిగా మారిన రాజగోపాల్రెడ్డికి మునుగోడు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.
పూటకో మాట.. ఊరుకో అబద్ధం
పూటకో మాట.. ఊరుకో అబద్ధం చెప్పడం కోమటిరెడ్డి బ్రదర్స్కు వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి జగదీశ్రెడ్డి దుయ్యబట్టారు. ఆరు సీట్లున్న పార్టీ నుంచి మూడు సీట్లున్న పార్టీలోకి వెళ్లి మునుగోడును ఎలా అభివృద్ధి చేస్తావని నియోజకవర్గ ప్రజలే రాజగోపాల్రెడ్డిని నిలదీస్తున్నారని గుర్తుచేశారు. సాధారణ ప్రజలకున్న కనీస ఇంగితం రాజగోపాల్రెడ్డికి లేదని ఎద్దేవాచేశారు. మూడున్నరేండ్లు ఎమ్మెల్యేగా ఉన్నా రాజగోపాల్రెడ్డి ఏనాడూ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. కాంట్రాక్టుల కోసమే మునుగోడు ప్రజలను వదిలి ఛత్తీస్గఢ్.. ఢిల్లీ.. కోల్కతాకు పారిపోయిన వ్యక్తి రాజగోపాల్రెడ్డి అని మండిపడ్డారు.
అసెంబ్లీలోనూ రాజగోపాల్రెడ్డి ఏనాడు మునుగోడు ప్రజాసమస్యల గురించి మాట్లాడలేదని, కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చే అంశాలనే లేవనెత్తారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్కో, జిల్లా మంత్రిగా తనకో లేదా అధికారులకో వినతి పత్రాలు అందించారా? ఉంటే చెప్పాలని జగదీశ్రెడ్డి సవాల్ విసిరారు. మునుగోడులో జరిగే ధర్మయుద్ధంలో గెలిచేది టీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టంచేశారు. మునుగోడులో టీఆర్ఎస్ చాలా బలంగా ఉన్నదని, పార్టీలో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామని స్పష్టంచేశారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని క్రమశిక్షణతో పాటించే సంస్కృతి తమ పార్టీలో ఉన్నదని.. అందరం కలిసి టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పారు.
బీజేపీకి మూడోస్థానమే
మునుగోడులో బీజేపీది మూడో స్థానమేనని జగదీశ్రెడ్డి చెప్పారు. గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చింది ఆరు శాతం ఓట్లు మాత్రమేనని గుర్తుచేశారు. రెండు లక్షలకుపైగా ఓట్లు పోలైతే బీజేపీకి వచ్చింది 12వేలు మాత్రమేనని చెప్పారు. ప్రజలకు ఏం ఒరగబెట్టారని ఆ పార్టీకి ఒక్కసారిగా ఓట్లు శాతం పెరుగుతుందని అన్నారు. రాజగోపాల్రెడ్డికి ఓటేస్తే బాయికాడ మోటర్కు మీటరు ఖాయమనే విషయం మునుగోడు ప్రజలకు తెలిసిపోయిందని జగదీశ్రెడ్డి అన్నారు. అదే టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే పెండింగ్ సమస్యలన్నీ పరిషారం అవుతాయని, అధికారంలో ఉన్నపార్టీకి ఓటేస్తేనే తమకు లాభం జరుగుతుందని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. మునుగోడులో నియోజకవర్గానికి కేంద్రమంత్రులు, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఓటరుకొకరు చొప్పునా వచ్చినా తమకేం ఇబ్బంది లేదని, టీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టంచేశారు. కాంగ్రెస్ తమకు పోటీయే కాదన్నారు.
కేసీఆర్కు వస్తున్న ఆదరణను తట్టుకోలేకే బీజేపీ కుట్రలు
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్కు వస్తున్న మంచిపేరును చూసి తట్టుకోలేకనే రాష్ట్రంపై బీజేపీ కుట్రలు చేస్తున్నదని జగదీశ్రెడ్డి విమర్శించారు. జాతీయ స్థాయిలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పేరుతో తిరిగితే తమ బండారం బయటపడుతుందని ఆందోళన చెందుతున్నదన్నారు. బీజేపీ పనికి మాలిన మాటలకు మోసపోయేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీపైనే మునుగోడులో పోటీచేస్తున్నామన్నామని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీల క్యాడర్, వివిధ స్థాయిల్లోని టీఆర్ఎస్ నాయకత్వం సమష్టి కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.