హైదరాబాద్ : కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం నవజాత శిశువు లాంటిదని, అటువంటి పసిగుడ్డు గొంతు నులిమేందుకు మోదీ సరార్ కుట్రలు పన్నుతోందని మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ను కాదని కమలనాథులకు అవకాశమిస్తే, బీజేపీ పాలకులు దేశాన్ని ప్రమాదపుటంచుల్లో నిలబెట్టారని ఆయన విమర్శించారు. ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లోని రెడ్కో కార్యాలయంలో రెడ్కో కార్పొరేషన్ చైర్మన్గా వై సతీశ్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి జగదీశ్ రెడ్డి ప్రసంగించారు.
వాట్సాప్ యూనివర్సిటీ కేంద్రంగా బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గుజరాత్ నమూనా అని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ, అదే గుజరాత్ను ఇప్పుడు చీకట్లోకి నెట్టేసిందన్నారు. వ్యవసాయానికి కనీసం ఆరు గంటల కరెంట్ను ఇవ్వకలేపోతున్న గుజరాత్ ప్రభుత్వం.. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించిందని గుర్తు చేశారు. మోదీ సర్కార్ విధానాల వల్ల యావత్ దేశంలో చీకట్లు అలుముకున్నాయని తెలిపారు. యావత్ దేశంలో చీకట్లు అలుముకున్న రోజున తెలంగాణలో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.