నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి చెంపపెట్టు ఫలితం రాబోతుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రజల తీర్పు న్యాయం వైపే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు. బీజేపీ ఎన్నీ కుట్రలు కుతంత్రాలు చేసినా.. ఐటీ , ఈడీ , అన్ని రాజ్యాంగ సంస్థలను ఉపయోగించిన మునుగోడు ప్రజల స్ఫూర్తిని ఆపలేకపోయిందని పేర్కొన్నారు. రేపటి విజయం తెలంగాణ అభివృద్ధికి, దేశంలోని ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు పునాది అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను అణచి వేయడానికి బీజేపీ కుట్ర చేస్తుందన్నారు.
బీజేపీ మాటలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు అని మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో దొరికిన దొంగల భండారం ప్రజల ముందు ఉంచామని తెలిపారు. దొరికిన దొంగలను బీజేపీ తప్పించే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. దొరికిన వారు నకిలీ ముఠా అయితే, మరి ఒరిజనల్ దొంగలు ఎవరో బండి సంజయ్ చెప్పాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ డొంక తిరుగుడు సమాధానాలు చెబుతుందని మండిపడ్డారు. దొరికిన వారు ఒరిజినల్ కానప్పుడు నందకుమార్ భార్య కేసు ఎందుకు వేసిందో చెప్పాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.