Munugode by Poll Results | మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న బీజేపీ నాయకులపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ను బెదిరించి బీజేపీ గెలవాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్ లీడ్లో ఉంది. దాన్ని జీర్ణించుకోలేక బీజేపీ నాయకులు మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను గందరగోళ పరుస్తున్నారని నిప్పులు చెరిగారు. ఈ విధానాలను మానుకోవాలని బీజేపీ నాయకులను జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.
ప్రజలు తప్పకుండా ధర్మం, న్యాయం వైపే ఉన్నారు. కేసీఆర్ నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు. మునుగోడు ప్రజలు కారుకే ఓటేశారు. రౌండ్ల వారిగా ఫలితాలను వెల్లడించడంలో ఎన్నికల పరిశీలకులు కొంత ఆలస్యం చేస్తున్నట్లు తెలిసింది. కానీ స్పష్టంగా కావాలని చెప్పి కేంద్ర మంత్రులు ఎన్నికల అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ఫలితం తారుమారు చేయాలన్న పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నాలు సాగవు. కేంద్ర ఎన్నికల పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి కలిసి సమన్వయంతో కౌంటింగ్ పూర్తయిన తర్వాతనే ఫలితాన్ని ప్రకటించాలి. తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రతి రౌండ్లోనూ లీడ్లో ఉంది. కావాలని చెప్పి బీజేపీ నాయకులు మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు. దీన్ని ఎన్నికల పరిశీలకులు ఆపాలి. కేంద్ర మంత్రులు అధికారులను భయపెట్టించడం సరికాదన్నారు. ప్రజలు బీజేపీని తిరస్కరించారు. తాను అనుకున్నట్టు ఓట్లు రాలేదని స్వయంగా బీజేపీ అభ్యర్థే చెప్పిన తర్వాత.. ఎన్నికల అధికారులను బెదిరించడం సరికాదు. అక్రమంగా గెలువాలనుకోవడం సరికాదు అని జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు.
ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన వెంటనే అధికారులు మీడియాకు వివరాలు తెలపాలి. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జాప్యంపై టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రౌండ్ల వారిగా కౌంటింగ్ ఫలితాల వెల్లడి ఆలస్యంపై మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి మీడియాకు లీకులు అందుతున్నాయన్న వార్తలపై ఈసీ స్పందించాలని జగదీశ్ రెడ్డి సూచించారు.