యాదాద్రి భువనగిరి : చౌటుప్పల్ ఎరువుల గోదాం శంకుస్థాపన కార్యక్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించిన బీజేపీ నాయకులపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే బీజేపీ నాయకులకు కోపం వస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ సభలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. దీంతో మహేందర్ రెడ్డి ప్రసంగాన్ని బీజేపీకి చెందిన సింగిల్ విండో డైరెక్టర్లు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి ఆ సింగిల్ విండో డైరెక్టర్లపై నిప్పులు చెరిగారు.
బీజేపీ ప్రభుత్వాల బట్టలు విప్పుతాం.. ఆ సమయం త్వరలోనే వస్తుందన్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే బీజేపీ నాయకులకు కోపం వస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రైతులకు మోదీ చేసిందేమీ లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించే దమ్ము బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.