సూర్యాపేట : ఉద్యమం సమయంలో చెప్పిన ప్రతీ మాటను ఎనిమిదేండ్ల పాలనలో కేసీఆర్ నిజం చేశారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మిట్, షాదీ ముబారక్ చెక్లను మంత్రి జగదీశ్ రెడ్డి పంపిణీ చేశారు. సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా 424 మంది లబ్దిదారులకు రూ. 4 కోట్ల 24 లక్షల విలువ చేసే చెక్లను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ తరహా అభివృద్ది దేశ వ్యాప్తం చేయడానికే కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందన్నారు. కేసీఆర్కు అండగా ఉండి అయన నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. కళ్యాణ లక్ష్మి కోసం ఇప్పటి వరకు సూర్యాపేట నియోజక వర్గంలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు రూ. 85 కోట్లు అని తెలిపారు. సూర్యాపేట నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధి పనుల విలువ రూ. 7000 కోట్లు దాటిందన్నారు.
తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఒకప్పుడు శాపనార్థాలు పెట్టిన ఏపీ ప్రజలు సైతం కేసీఆర్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.