Minister Jagadish Reddy | నల్లగొండ : హిందుత్వానికి ఏ ఒక్కరూ ఛాంపియన్ కాదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. హిందుత్వాన్ని రాజకీయాల్లోకి దూర్చి కొందరు హిందుత్వ( Hindutva ) గౌరవాన్ని దిగజారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్మే వారు ఇటువంటి కుట్రలకు తెర లేపుతున్నారని ఆయన దుయ్యబట్టారు. శనివారం సాయంత్రం నల్లగొండ( Nallagonda ) జిల్లా కేంద్రంలోనీ వేద పాఠశాల ప్రాంగణంలో తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం, దేవాలయ దీప, ధూప మత్తైక అర్చక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ శోభాక్రుత్ కాల నిర్ణయ పంచాంగాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సభలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ విలువలు అంటేనే హిందుత్వానికి ప్రతీక అని ఆయన కొనియాడారు. వేల సంవత్సరాల నుండే ఇది విరాజిల్లుతుందన్నారు. మానవ సమాజం మొదలైన రోజు నుండే భారతదేశంలో విలువలకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. పాశ్చాత్య పోకడలు పోయిన వారు కుడా కాల క్రమంలో సనాతన హిందు విలువలకు పెద్ద పీట వేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నక్షత్రాలలో జరుగుతున్న మార్పులను పట్టే పంచాంగం రూపొందించడం భారతీయ సమాజంలో అనాదిగా వస్తుందాన్నారు. వాటిని శాస్త్రీయంగా అధ్యయనం చేసిన మీదటనే కాల నిర్ణయంతో పాటు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను నిర్దేశిస్తారన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో ఇక్కడ వేదపాఠశాల నెలకొల్పడం జరిగిందన్నారు. శాశ్వతమైన భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలా చారి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.